Sunday, April 28, 2024

భారత్‌కు మోడీ ప్రధాని కావడం మన దురదృష్టం: మంత్రి పువ్వాడ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడం పట్ల బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రం ధర్నా చౌక్ నందు బిఆర్ఎస్ నగర పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి, గ్యాస్ సిలిండర్ కటౌట్లు… సిలిండర్లతో.. వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఏడాదిలో ముడు సార్లు గ్యాస్ ధరలు పెంచితే కనీసం ఒక్క బిజెపి నాయకుడు కూడా మాట్లాడలేదని, సామాన్య ప్రజల బాధలు మోడీ లాంటి వాళ్లకు ఏం తెలుస్తాయి అని, టోటల్ గ్యాస్ పేరుతో అదానీ గ్యాస్ కు కట్టబెట్టేందుకే ధరల పెంపు అని ఆరోపించారు.

చిరు వ్యాపారాలు చేసుకునే వారు వినియోగించే కమర్షియల్ సిలిండర్ పై రూ.350 పెంచితే వారి జీవనం ఎలా సాగుతుందని, నేడు లక్షల కుటుంబాలు రోడ్డు పక్కన చిరు వ్యాపారాలు చేకునే వారి కుటుంబాలను పోషించుకుంటున్నారని వారిని సైతం వదలకుండా వారి నడ్డి విరిచేశారని ద్వజమెత్తారు. తెలంగాణ సాధనకు గానీ, సాధించుకునేందుకు గానీ, తెలంగాణ ఉద్యమంలో గానీ ఎలాంటి సంబంధం లేని బండి సంజయ్ కూడా మాట్లాడుతాడు అని, కనీస అవగాహన లేకుండా నోటి నిండా తంబాకు బుక్కి సొల్లు వాగడం తప్ప నేడు మీరు రూ.50 ధర ఎందుకు పెంచావో చెప్పాలన్నారు.

విదేశాల్లో ఉన్న నల్ల ధనంను ఒక ఏడాదిలోనే తీసుకొచ్చి ప్రజలకు జన్ ధన్ ఖాతాల్లో దన్ దన్ మని వేస్తా అన్నావు గా ఏమైంది… నీ జన్ దన్ అని ప్రశ్నించారు. ఉల్లి గడ్డల ధరలు పెంచితున్నందుకు నిరసన తెలిపిన రైతులను ఉద్దేశించి కేంద్ర మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ బాధ్యతా రహితంగా నేను ఉల్లిగడ్డలు తినను అని అనడం సిగ్గు చేటన్నారు. నువ్వూ తినకపోతే ధరలు పెంచేస్తారా… పాలు, పెరుగు ఆఖరికి చేనేత పై కూడా 5శాతం పన్ను విధించడం సిగ్గుచేటన్నారు.

కాంగ్రెస్స్ ప్రభుత్వంలో మన్మోహన్ ప్రధాని గా ఉన్న సమయంలో గ్యాస్ ధర రూ.50 పెంచితే ప్రస్తుత మంత్రి స్మృతి ఇరానీ నాడు పెద్ద ఎత్తున ఆందోళన చేసి గగ్గోలు పెట్టిందని మరీ ఇప్పుడు మీరు చేసింది ఏంటని ప్రశ్నించారు. ధరలు పెంచడంలో మీరు కాంగ్రెస్స్ ను మించిపోయారని విమర్శించారు. ఆ మహానుభావుడి మాటలు నమ్మి సిలిండర్ లు తీసుకున్నారు.. కట్టెల పొయ్యి ఉన్న వారికి బలవంతంగా సిలిండర్ లను అంటగట్టి మరీ పేదలను గ్యాస్ కు అలవాటు చేసి నేడు ధరలు పెంచేశారని విమర్శించారు.

ఒంటికొమ్ము శొంఠి కాయ కాబట్టి పేద కుటుంబాల సమస్యలు వాళ్లకు తెలియవు అని అన్నారు. ప్రధాని మోడీ మిత్రుడు అదానికి జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అని, గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ నేడు దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. 75సంవత్సరాల స్వతంత్ర పాలనలో… సిలిండర్ పై సంవత్సరానికి 100 రూపాయలు పెంచిన ఘనత కేవలం ప్రధాని మోడీకే దక్కుతుందను, బిజెపి అధికారంలోకి రాకముందు… 8 సంవత్సరాల క్రితం కేవలం 410 రూపాయలు ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు 1160 రూపాయలకు చేరుకుందనీ అన్నారు.

స్వాతంత్ర్య భారత దేశ చరిత్రలో ఇంతగా ధరలు పెంచిన ప్రధాని ఎవరు లేరనీ, గడిచిన 8 సంవత్సరాలలో సిలిండర్ పై 800 రూపాయలు పెంచిన మహానుభావుడు ప్రధాని మోడీ అని అన్నారు. ధరల పెంపు పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం… పేద మధ్యతరగతి ప్రజల బాధలను పట్టించుకోవడం లేదనీ,పెరిగిన ధరలను తగ్గించేందుకు చర్యలు కూడా తీసుకోవడం లేదనీ అన్నారు. అదానికి దోచి పెట్టేందుకు పేద మధ్యతరగతి ప్రజలపై భారాన్ని మోపారనీ, మన రక్తపు ముద్దను మోడీ గుజరాత్ కు దోచిపెడుతున్నారనీ అన్నారు. తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆసరా పింఛన్లు.. కళ్యాణ లక్ష్మి…కెసిఆర్ కిట్స్.. వ్యవసాయానికి ఉచిత కరెంటులతో.. తెలంగాణలో ఆకలికేకలు లేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే.. ప్రధాని మోడీ పెట్రోల్, గ్యాస్, పప్పులు, నిత్యావసర ధరలు పెంచి… దేశ ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తున్నారనీ దుయ్యబట్టారు.

గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1160 నుంచి 8 వందలకు తగ్గించాలనీ, అప్పటి వరకు ఉద్యమాన్ని ఆపబోమనీ హెచ్చరించారు. గ్యాస్ పెంపు ధరలను దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంన్నారని, పెరిగిన ధరలు తగ్గించే వరకు ఆడబిడ్డలు చేపట్టే ఉద్యమానికి బిఆర్ఎస్ అండగా ఉంటుందనీ తెలిపారు.రాష్ట్రంలో ఓవైపు సంక్షేమ పథకాలతో తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉండాలని సీఎం చర్యలు తీసుకుంటుంటే.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరుపేద మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తుందనీ అన్నారు. పెంచిన ధరలు తగ్గించేవరకు ఈ పోరాటం ఆగదనీ హెచ్చరించారు. నేడు దేశంలో ప్రజాస్వామ్యంగా ఎన్నిక కాబడిన ప్రభుత్వాలను దొడ్డి దారిన కుల్చుతున్నది మోడీ ప్రభుత్వ కాదా అని ప్రశ్నించారు.

మన రాష్ట్రం మీద కూడా విషం చిమ్మే ప్రయత్నం చేశారని కానీ దాన్ని ముఖ్యమంత్రి ముందుగానే పసిగట్టి మీడియాకు పట్టించారని, తనకు ఉన్న సమాచారంతో అడ్డుకుని వారి కుటిల ప్రయత్నాన్ని నిరోధించగలిగారని అన్నారు. అందుకే దేశంలో జరుగున్న లూటిని ఆపాలంటే బిఆరఎస్ రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశాన్ని అమ్మే సంస్కృతి నుండి కాపాడుకునే సంస్కృతి రావాలంటే బిఆరఎస్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పేద ప్రజలకు భీమా గా నిలిచి ఉన్న ఎల్ఐసి సంస్థను నేడు అమ్మేసి సిగ్గులేకుండా మరిన్ని అమ్మాలని చూస్తున్నారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News