Monday, April 29, 2024

అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ’విక్టరీ బెల్’ ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్: ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని అపోలో క్యాన్సర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ‘విక్టరీ బెల్’ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి డీ శ్రీధర్ బాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యాన్సర్ రోగులు అధైర్యపడకూడదన్నారు. ఆత్మవిశ్వాసమే కొండంత బలమని తెలిపారు.అనంతరం అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి మాట్లాడుతూ ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విక్టరీ బెల్ ను ఆవిష్కరించడం ఒక ముఖ్యమైన ఘట్టం అన్నారు.

ఇది ఆసుపత్రిలోని ఆంకాలజీ యూనిట్లలో జరిగిన పోరాటాలకే కాకుండా ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణాన్ని నిర్వచిస్తుందన్నారు. విజయం, పట్టుదల స్ఫూర్తికి ప్రతీక అన్నారు. ప్రతికూల పరిస్థితులపై ప్రబలమైన మానవ స్ఫూర్తికి శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తుందన్నారు.అపోలో క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పీ విజయ్ ఆనంద్ రెడ్డి మాట్లాడుతూ ..విజయ గంట నుంచి వచ్చే శబ్దం క్యాన్సర్ ను జయించిన వ్యక్తి ముఖ్యమైన విజయాన్ని సూచిస్తుందన్నారు. ఇది వారికి వారి ప్రియమైన వారికి చిరస్మరణీయమైన క్షణాలను అందిస్తుందన్నారు. శ్రావ్యమైన రింగింగ్ సౌండ్ చికిత్సలో ఉన్నవారిలో ఆశను పదిలపరుస్తుందని తెలిపారు.క్యాన్సర్ చికిత్సను పూర్తి చేసుకున్న రోగులు విక్టరీ బెల్ మోగించే అవకాశం ఉందన్నారు.ఇది వ్యక్తిగత విజయాన్ని ప్రతిధ్వనిస్తుందని,ఇతరులకు ఎంతో స్పూర్తి వంతంగా ఉంటుందన్నారు.ప్రతీ క్యాన్సర్ రోగి విజయం వెనుక ధైర్యం, ఆశ, బలంతో కూడిన కథ ఉంటుందని,వైద్య ప్రక్రియలో భావోద్వేగం, మానసిక అంశాలను గుర్తించడం ముఖ్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య నిపుణులు, రోగులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News