అత్యాచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
అధికారులను ఆదేశించిన మంత్రి శ్రీనివాస్గౌడ్
మనతెలంగాణ/హైదరాబాద్ : సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో మహిళల భద్రతకు ఎన్నో చర్యలు చేపట్టామని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. మహబూబ్ నగర్ పట్టణానికి చెందిన ఇద్దరు మహిళలపై గాంధీ ఆస్పత్రిలో అత్యాచారం జరిగిన సంఘటపై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంటనే స్పందించారు. మంగళవారం గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఆసుపత్రి సూపరింటెండెంట్ రాజారావు, వివిధ విభాగాల ఉన్నతాధికారులను కలిసి సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ దోషులను కఠినంగా శిక్షిస్తామన్నారు. అత్యాచారం జరిపిన వారిపై కఠినంగా, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. నిందితులు ఎంతటి వారైనా వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను మంత్రి ఆదేశించారు.
ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోని మహిళలు గర్వించే విధంగా గతంలో శంషాబాద్లోని చటాన్పల్లిలో దిశ ఘటన మాదిరిగా కఠినంగా వ్యవహారిస్తామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మహిళల కోసం షీ టీమ్స్లను ఏర్పాటు చేసి మహిళల భద్రతకు పెద్ద పీట వేశామన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల్లో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మహిళల పట్ల ఎన్నో దారుణమైన సంఘటనలు జరుగుతున్నాయన్నారు. దేశంలో ఏ ఒక్క మహిళపై అత్యాచారం కానీ అవమానించేలా మాట్లాడిన కఠినంగా శిక్షించాలని, అందుకు చట్టంలో మార్పులు తీసుకురావాలని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.