Sunday, April 28, 2024

ప్రతి ధాన్యం గింజనూ కేంద్ర ప్రభుత్వం కొనాల్సిందే

- Advertisement -
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఒకే ధాన్యం సేకరణ విధానం ఉండాలి
కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదు
గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో రాష్ట్ర రైతులు ఉద్యమిస్తారు
దేశ రాజధాని వేదికగా కేంద్రంపై నిప్పులు చెరిగిన ఎంఎల్‌సి కవిత

Modi govt will purchase every grain

మన తెలంగాణ/హైదరాబాద్ :దేశ వ్యాప్తంగా రైతులు చేసిన ఉద్యమంతో సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నట్లుగానే రాష్ట్రంలోని
ప్రతి వరి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే ఢిల్లీ వీధుల్లో తెలంగాణ రైతులు ఉద్యమిస్తారని ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుపై అన్ని రాష్ట్రాల్లో ఒకే విధానం ఉండాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.

130 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఆహార భద్రత చాలా ముఖ్యమన్నారు. భవిష్యత్తులో ఏదైనా సంక్షోభంతో ఆహార కొరత ఏర్పడితే ప్రపంచంలోని ఏ దేశమూ సాయం అందించలేదని కవిత తెలిపారు. ఆహార భద్రత కోసమే ఏర్పడిన ఎఫ్‌సిఐకి ఎలాంటి వార్షిక క్యాలెండర్ లేకపోగా, ధాన్యం సేకరణకు సరైన విధానం సైతం లేదని ఆమె విమర్శించారు. ఎఫ్‌సిఐ వివిధ రాష్ట్రాల నుండి ఒక పద్దతి లేకుండా ధాన్యాలను కొంటున్నదని, ప్రతి ఏడాది ఎఫ్‌సిఐ పంట కొనుగోలుకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

దేశ రాజధానిలో ఉన్న ఆమె ఢిల్లీ వేదికగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ఈ మేరకు గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో కేంద్రం తీరుపై దుయ్యబట్టారు. వార్షిక క్యాలెండర్ ప్రకారం ప్రతి రాష్ట్రం ఏ పంట పండించాలి? అనే విషయంపై అక్కడి రైతులకు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంటుందని కవిత పేర్కొన్నారు. రాష్ట్రం, కులం, మతంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా రైతు…. రైతేనని ఆమె పేర్కొన్నారు. కేంద్రం ఒక్కో రాష్ట్ర రైతులను ఒక్కోలా పరిగణించకూడదన్నారు.

సాగులో అద్భుతమైన ప్రగతి
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ నేపథ్యం భిన్నమైనదని కవిత అన్నారు. ఒకప్పుడు నీటి కొరత ఉన్న తెలంగాణలో గత 8 సంవత్సరాలుగా సిఎం కెసిఆర్ విధానాలతో అద్భుతమైన సాగునీటి వసతులు ఏర్పాటు చేయడంతో పాటు రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని కవిత గుర్తు చేశారు. రైతుల నుండి నీటి పన్ను వసూలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్న ఆమె, రైతు బంధు పథకంతో ఎకరానికి ప్రతి ఏడాది రూ. పదివేల పెట్టుబడి సాయం అందిస్తున్నామన్నారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలతో రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి రెట్టింపు అయిందన్నారు. దీంతో ధాన్యం వినియోగం అనంతరం అనేక మిగులు ధాన్యం రాష్ట్రంలో ఉంటోందని కవిత పేర్కొన్నారు. అందువల్లే ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు కోరామనారు. ధాన్యం కొనుగోలుపై గతంలో హామీ ఇచ్చిన బిజెపి ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పిందని ఈ సందర్భఁగా ఆమె విమర్శించారు.

కొనుగోళ్లలో ఎలాంటి కండీషన్లు పెట్టవద్దు

వరి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో రాష్ట్రంలోని 61 లక్షల మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని కవిత తెలిపారు. పంజాబ్‌లో కొంటున్న విధంగానే రాష్ట్రంలోనూ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనాలని కేంద్రాన్ని డిమాండ్ చేసిన ఆమె బాయిల్డ్ రైస్, ముడి బియ్యం అంటూ కండిషన్‌లు పెట్టకూడదన్నారు. రాష్ట్ర రైతులు ధాన్యం కొనుగోలుకై జాతీయ రహదారులపై చేస్తున్న నిరసనలతో ఇబ్బంది పడ్డ ఇతర రాష్ట్రాల ప్రజలు ధాన్యం కొనుగోలు అంశాన్ని ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు, ఢిల్లీ వీదుల్లో ఉద్యమాలు చేసే పరిస్థితి తీసుకురావద్దని బిజెపి ప్రభుత్వానికి ఈ సందర్భంగా కవిత సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News