ఎమర్జెన్సీపై పోరాడిన ప్రజల త్యాగాలు మరువబోము: ప్రధాని నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: అత్యవసర పరిస్థితి కాలంలో ప్రజాస్వామ్యం కోసం పోరాడిన ప్రజల త్యాగాలను ఎన్నటికీ మరువలేమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. 1975 జూన్ 25న దేశంలో అత్యవసర పరిస్థితిని అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించారు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం దేశంలో ఎమర్జెన్సీని విధించారని, అప్పట్లో దేశంలో ప్రజాస్వామిక హక్కుల కోసం పోరాడి, చిత్రహింసలను ఎదుర్కొన్న ప్రజల త్యాగాలను ఈ దేశం ఎన్నటికీ మరువబోదని ప్రధాని మోడీ గురువారం హిందీలో ట్వీట్ చేశారు.
2019 జూన్ 20వ తేదీన తాను నిర్వహించిన మన్ కీ బాత్ రేడియో కార్యక్రమంలో ఎమర్జెన్సీని ప్రస్తావిస్తూ తాను చేసిన ప్రసంగం తాలూకు ఆడియో క్లిప్పింగ్ను కూడా తన ట్వీట్కు మోడీ జతపరిచారు. ఆనాటి రేడియో కార్యక్రమంలో ప్రధాని ప్రసంగిస్తూ ప్రజలకు ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను గుర్తుచేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయవద్దని ప్రజలను అర్థిస్తూ ప్రజాస్వామిక హక్కులను కాపాడడం నానాటికీ కష్టసాధ్యమవుతోందని ప్రధాని మోడీ అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ తర్వాత 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికలలో ప్రజలు తమకు సంబంధించిన ఇతర హక్కులను, అవసరాలను పక్కనపెట్టి వోటు వేశారని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ అనే ఏకైక ధ్యేయంతో ప్రజలు ఆనాడు వోటు వేశారని ఆయన తెలిపారు. అటువంటి ఎన్నిక 1977లో మాత్రమే దేశం ఎదుర్కొందని ఆయన పేర్కొన్నారు.