ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ చర్చలు
న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి పరస్పరం సహకరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు సమానంగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతపై వీరిద్దరూ పరస్పరం అంగీకారానికి వచ్చారు. దీనిపై నిబంధనలతో కూడిన అంతర్జాతీయ విధానం కోసం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పరస్పర సహకారంతో కూడిన విధానం ఏర్పాటుకు కలసి కట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకతపై కూడా ఉభయులు చర్చించారు.
శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ కొవిడ్-19 సెకండ్ వేవ్పై పోరాటంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆ దేశ పౌరులు అందచేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్ను ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు అందరికీ అందుబాటు ధరలలో, సమానంగా లభించేందుకు కృషిచేయాల్సిన ఆవశ్యకతపై ఉభయ దేశాల ప్రధానమంత్రులు ఒక అంగీకారానికి వచ్చారని పిఎంఓ తెలిపింది. ఆస్ట్రేలియా ప్రధానితో తన సంభాషణపై ప్రధాని మోడీ కూడా ట్వీట్ చేశారు.