న్యూఢిల్లీ: కొవిడ్-19 పరిస్థితిని చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 4న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన అన్ని పార్టీలకు చెందిన సభా నాయకులను ఆహ్వానించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే ఈ వర్చువల్ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సమన్వయం చేస్తోంది.
దేశంలో కరోనా మహమ్మారి విజృంభించిన తర్వాత దీనిపై చర్చించడానికి ప్రభుత్వం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడం ఇది రెండవసారి. ఈ సమావేశంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్తోసహా పలువురు కేంద్ర మంత్రులు పాల్గొనే అవకాశం ఉంది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కూడా పాల్గొంటారని తెలుస్తోంది. కరోనా వ్యాక్సిన్ తయారీలో నిమగ్నమైన అహ్మదాబాద్, హైదరాబాద్, పుణెలోని ఫార్మాస్యుటికల్ కంపెనీలను ప్రధాని మోడీ సందర్శించిన అనంతరం ఈ సమావేశం జరగనుండడంతో దీనికి అధిక ప్రాధాన్యత ఏర్పడింది.