Tuesday, April 30, 2024

సంఘ్ పరివార్ స్వరం మారిందా!?

- Advertisement -
- Advertisement -

ప్రతి మసీదులో శివలింగాన్ని వెతకనవసరం లేదు”, “మసీదులను దేవాలయాలుగా మార్చాలని చేపట్టే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్.ఎస్.ఎస్ పాల్గొనదు” అని ఆర్.ఎస్.ఎస్. అధినేత మోహన్ భగవత్ ఈ నెల 2 వ తేదీన నాగ్‌పూర్‌లో ప్రకటించారు. ఈ మాటలు ఆ సంస్థ సభ్యులను సైతం ఆశ్చర్యపరిచాయి. “బిజెపి అన్ని మతాలనూ గౌరవిస్తుంది. ఏ మతాన్నైనా సరే, ఏ మతానికి చెందిన వారినైనా సరే అవమానించడాన్ని బిజెపి ఖండిస్తుంది” అని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ ఆదివారం ఢిల్లీలో ప్రకటించారు. ఈ మాటలు బిజెపి శ్రేణులనే కాదు దేశం మొత్తాన్ని ఆశ్చర్యపరచాయి. దేశాన్ని ఎనిమిదేళ్ళుగా పాలిస్తున్న బిజెపి నాయకత్వంతో పాటు, దాని తాత్విక రూపం ఆర్.ఎస్.ఎస్ స్వరంలో తొలిసారిగా వెలువడిన మాటలివి. వీరి స్వరం నిజంగా మారిందా? అవసరానికి స్వరం మార్చి చెపుతున్నారా? అన్నది ఇప్పుడు ప్రజల ముందున్న అతిపెద్ద సందేహం.

బిజెపి అధికార ప్రతినిధి నూపూర్ శర్మ, ఆ పార్టీ ఢిల్లీ మీడియా సెల్ బాధ్యుడు నవీన్ కుమార్ మహమ్మద్ ప్రవక్త పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ముస్లిం దేశాలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశాయి. “ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కో ఆపరేషన్‌” తమ తీవ్ర నిరసనను వ్యక్త చేసింది. ప్రపంచ దేశాలమధ్య ఏర్పడిన సంస్థల్లో ఐక్యరాజ్య సమితి తరువాత అతి పెద్ద సంస్థ ఇది. యాభై ఏడు ఇస్లామిక్ దేశాలతో ఏర్పడిన ఈ సంస్థ పరిధిలో 180 కోట్ల మంది ప్రజలున్నారు. అంటే భారత జనాభాకంటే 50 కోట్ల మంది అధికం. భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో ముస్లిం మహిళలు విద్యాలయాలలో ‘హిజాబ్’ ధరించడాన్ని నిషేధించినప్పుడు, మైనారిటీలపై హింస, వారి ఆస్తుల విధ్వంసం జరిగినప్పుడు కూడా గతంలో ‘ఆర్గనైజేషన్ ఫర్ ఇస్లామిక్ కో ఆపరేషన్‌” భారతదేశానికి తమ నిరసనను తెలిపింది.

భారత్‌తో సత్సంబంధాలున్న ఖతర్, కువైట్ వంటి దేశాలు కూడా భారత రాయబారిని పిలిచి తమ నిరసనను వ్యక్తం చేశాయి. మహమ్మద్ ప్రవక్తపై బిజెపి నాయకులు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో ఇస్లామిక్ దేశాలు భగ్గుమన్నాయి. భారత ఉత్పత్తుల అమ్మకాలను నిలిపివేశాయి. సామాజిక మాధ్యమాలలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. యాభై ఏడు ఇస్లామిక్ దేశాలతో ఆర్థిక సంబంధాలు దెబ్బతింటే భారత ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద కుదుపునకు గురవుతుంది. ఇస్లామిక్ దేశాలలో ఉన్న హిందువుల భద్రతకు కూడా ముప్పు ఏర్పడే ప్రమాదం ముంచుకొస్తుంది. విధిలేని పరిస్థితిలో భారత విదేశీ వ్యవహారాల శాఖ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. మహమ్మద్ ప్రవక్తను కించపరిచే మాటలు తమవి కావని, అలా కించపరిచిన వారిపై చర్యలు తీసుకుంటామని ముస్లిం దేశాలకు హామీ ఇచ్చింది. నూపూర్ శర్మను పార్టీ నుంచి సస్పెండ్ చేయగా, నవీన్ కమార్‌ను పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించింది.

కేంద్రంలో, కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న బిజెపి నాయకులు మైనారిటీలపట్ల వివక్షతతో వ్యవహరిస్తున్నారనడానికి అనేక సంఘటనలు ప్రజల మదిలో ఇంకా సజీవంగా ఉన్నాయి. బిజెపి నాయకత్వంలోని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కనీసం నోటీసులు ఇవ్వకుండా జహంగిర్‌పురిలోని పేద ముస్లిం ల ఇళ్ళను, షాపులను బుల్డోజర్లతో ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్‌లోని రాయ్‌గఢ్ జిల్లాలో ఒక నిందితుడి ఇంటిని బుల్డోజర్‌తో కూలదోయమని స్వయంగా బిజెపి ముఖ్యమంత్రే ఆదేశాలు జారీ చేశారు. షియాపూర్‌లోనూ ఇలాగే ధ్వంసం చేశారు. ఖార్‌గోన్‌లోనూ ముస్లిం ఇళ్ళను ధ్వంసం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఇక లెక్కేలేదు. బుల్డోజర్ చర్యలు ఇటీవల అక్కడి నుంచే మొదలయ్యాయి.

ఈ సంఘటనల్లో ఇళ్ళు కోల్పోయిన వారంతా ముస్లింలే. శ్రీరామ నవమి ఉత్సవాలపేరుతోను, హనుమాన్ శోభాయాత్రల పేరుతోను ముస్లిం ఇళ్ళ ముందు, మసీదుల ముందు కత్తులతో, కాషాయ జెండాలతో ఊరేగింపులు జరిపి వారిని రెచ్చగొట్టి, వారి పైన కేసులుపెట్టి, వారి ఇళ్ళను ధ్వంసం చేయడమేనా అన్ని మతాలను గౌరవించడం అంటే !? ముస్లింలకు ఇళ్ళులేకుండా, ఉపాధిలేకుండా చేయడమేనా బిజెపి అన్ని మతాలను గౌరవించడమంటే!? ఆర్‌ఎస్‌ఎస్ ముస్లింలతో ఏర్పాటు చేసిన అనుబంధ సంస్థ ‘ముస్లిం రాష్ట్రీయ మంచ్’ ను ఉద్దేశించి ఆదివారం మోహన్ భగవత్ మాట్లాడుతూ “హిందువులు కానీ, ముస్లింలు కానీ ఎవ్వరి ఆధిపత్యం ఉండకూడదు. దేశంలో భారతీయు ఆధిపత్యమే ఉండాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం” అన్నారు. ఎంత మంచి మాటలు.

“భారత దేశంలో ముస్లింలు ఉండరాదు అని ఏ హిందువైనా అంటే అతను హిందువు కాదు” అని ఎంతో ఆదర్శం గా చెప్పారు. మరొక అడుకు ముందుకేసి “మతంతో సంబంధం లేకుండా భారతీయులందరి డిఎన్‌ఎ ఒకటే” అని చెప్పి ఆర్‌ఎస్ ఎస్ వారిని కూడా ఆశ్చర్యచకితులను చేశారు. ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంస్థలే బాబ్రీ మసీదును కూలగొట్టి, దేశంలో ముఖ్యంగా గుజరాత్‌లో మత విద్వేషాలను పురిగొల్పి, వేలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైనప్పుడు, ఈ తాత్విక దృష్టి ఆర్‌ఎస్‌ఎస్‌కు, దాని అనుబంధ సంస్థలకు ఏమైంది!? గో రక్షణ పేరుతో ముస్లింలపై దాడులు చేసినప్పుడు, క్రైస్తవులపైనా, చర్చిలపైనా దాడులు చేసినప్పుడు, హిందూ ముస్లిం వివాహాలకు వ్యతిరేకంగా ‘లవ్ జిహాదీ’ ప్రయోగించినప్పుడు, పండుగలను ఒక సందర్భంగా చేసుకుని ముస్లింల నివాస ప్రాంతాలలోకి బలవంతంగా ప్రవేశించినప్పుడు ఈ తాత్విక చింతన గుర్తుకు రాలేదా!?

రామ జన్మభూమి పేరుతో అయోధ్యలో బాబ్రీ మసీదును ఎలాగూ కూల్చేశారు. ఫలితంగా దేశమంతా మత కల్లోలాలు రేగాయి. ఈ కల్లోలాలలో హిందువులు, ముస్లింలు ఆస్తులను కోల్పోయారు. వేలాది మంది ప్రాణాలనూ కోల్పోయారు. వారిలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ శ్రీకృష్ణుడి జన్మస్థానమని మధురలో షాహీ ఈద్గా మసీదును తొలగించాలని పట్టుబట్టడం, వారణాసిలో కాశీ విశ్వేశ్వరాలయం వద్ద ఉన్న జ్ఞానవాపి మసీదులో శివలింగం ఉందని, ఆ మసీదును తొలగించి ఆ జాగా ను తమకు అప్పగించాలని ఫిర్యాదు చేయడం, కుతుబ్ మినార్ ఆవరణలోని మసీదును తొలగించాలని కోరడం, తాజ్‌మహల్ అసలు శివాలయమని వాదించడంలో సంఘ్‌పరివార్ శక్తుల సాహసమేమిటి!? ఈ సాహసాలన్నీ మోహన్ భగవత్ తాజాగా ప్రవచించిన తాత్వికతకు లోబడే ఉన్నాయా!? మహాత్మా గాంధీ హత్యను సమర్థించి, ఆ హత్య చేసిన నాథూరావ్‌ు గాడ్సేను దేశ భక్తుడని బిజెపి ఎంపి ప్రజ్ఞాసింగ్ కీర్తించినప్పుడు కానీ, ఆ పార్టీ ఎంపిలు సాక్షి మహరాజ్, తేజస్వీ సూర్యా ముస్లింలపై విద్వేష వ్యాఖ్యలు చేసినప్పుడు కానీ మోహన్ భగవత్ ఇలా హిత బోధ ఎందుకు చేయలేదు!? ప్రధాని నరేంద్ర మోడీ నోరు ఎందుకు మెదపలేదు!? బిజెపి అధికారంలోకి వచ్చాక ముస్లింలు, ఇతరమైనారిటీ వర్గాలు ఒక అభద్రతకు లోనయిన మాట వాస్తవం.

మనకు స్వాతంత్య్రం సిద్ధించి ఈ ఏడాది ఆగస్టు 15కు 75 ఏళ్ళు పూర్తి కావస్తున్నాయి. కశ్మీరి సమస్య పరిష్కారం కాలేదు. బిజెపి అధికారంలోకి వచ్చాక అది మరింత జటిలమై కూర్చుంది. కేంద్ర ప్రభుత్వంలో బిజెపి భాగస్వామిగా ఉన్నప్పుడే 1990లో కశ్మీరి గవర్నర్ జగ్‌మోహన్ మల్హోత్రా లోయలోని పండిట్లను ఇతర ప్రాంతాలకు బస్సుల్లో తరలించారు. “రెండు నెలల్లో మిమ్మల్ని కశ్మీరుకు తిరిగి తీసుకెళతాం. ఇక్కడ ప్రజలపైన బలప్రయోగం చేయాలి. మీరు ఇక్కడ ఉంటే ఆ ప్రభావం మీపైన ఉంటుంది” అని పండిట్లకు నచ్చచెప్పి మరీ వారిని తరలించారు. కశ్మీరులో ప్రజలను హిందు పండిట్లుగా, ముస్లింలుగా విభజించి, ముస్లింలపైన దాడి చేయడమే ఎజెండాగా బిజెపి భాగస్వామిగా గల కేంద్రప్రభుత్వం నాడు పూనుకున్నది. ఆ మత చిచ్చు ఇప్పటి వరకు చల్లారలేదు. మతం ప్రాతిపదికగా ప్రజలను విడదీసి పాలించాలనుకోవడం వల్లనే పండిట్లను ఇప్పటి వరకు తిరిగి లోయలోకి పంపించ లేకపోతున్నారు.

పండిట్లు తమతమ ప్రాంతాలకు తిరిగి వెళ్ళాలని, 600 మందికి ఉద్యోగాలు కల్పిస్తానని 2008లో నాటి ప్రభాని మన్మోహన్‌సింగ్ హామీ ఇచ్చారు. దాంతో కశ్మీర్ లోయలో పండిట్లు ఉద్యోగాలు పొంది ప్రశాంతంగానే ఉన్నారు. కశ్మీర్ లోయలో ఇప్పుడు 4000 మంది పండిట్లు పనిచేస్తన్నారు. జమ్ముకశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని బిజెపి ప్రభుత్వం 2019 లో రద్దు చేయడంతో ఇటీవల లోయలో అలజడి మళ్ళీ మొదలైంది. గత శుక్రవారం మిటిటెంట్లు విజయ్‌కుమార్ అనే బ్యాంకు మేనేజర్‌ను కాల్చి చంపారు. అతను రాజస్థాన్‌కు చెందిన వాడు. గత నెల 12న రాహుల్ భట్ అనే ఉద్యోగిని ఆఫీసులో ఉండగానే కాల్చి చంపారు. ఒక ముస్లిం కళాకారిణిని చంపారు. ఒక టీచర్‌ను చంపారు. ఒక వైన్‌షాపు ఉద్యోగిని చంపారు. దీంతో కశ్మీర్ పండిట్లలో భయభ్రాంతులు నెలకొన్నాయి. ప్రభుత్వం తమకు భద్రత కల్పించలేకపోతోందని, వందలాది మంది కశ్మీర్ పండిట్లు లోయను వదిలేసి జమ్మూ ప్రాంతానికి తరలి వెళ్ళిపోయారు. పండిట్లకు కూడా ఈ ప్రభుత్వం పైన నమ్మకం సడలిపోయింది. ఎందుకిలా జరిగింది!? బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముస్లింలే ధ్యేయంగా దాడులు చేశారు. వారి ఇళ్ళను, షాపులను బుల్డోజర్లతో కూల్చివేశారు.

బాబ్రీ మసీదు లాగా ముస్లింల ప్రార్థనాలయాలను, మొగల్ కాలం నాటి చారిత్రక నిర్మాణాలను కూడా కూల్చివేయాలనో, హిందూ ఆలయాల పేరుతో స్వాధీనం చేసుకోవాలనో వివాదాలు మొదలు పెట్టడం వల్ల కశ్మీర్ లోయలో మిలిటెంట్ల నుంచి ప్రతి చర్యలు మొదలయ్యాయి. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి వీటి నుంచి బయటపడడమే తక్షణావసరం. అందుకే దాని తాత్విక పునాదిగా గల ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ ఈనె 2 వతేదీన నాగపూర్‌లో ప్రసంగిస్తూ, “మసీదులను దేవాలయాలుగా మార్చాలనే ఉద్యమంలో కానీ, ప్రచారంలో కానీ ఆర్‌ఎస్‌ఎస్ పాల్గొనదు” అని ప్రకటించారు. ఆ ప్రకటన నిజంగా వారి మనసు నుంచి వచ్చినట్టయితే “మసీదులను తవ్వుదాం. శివలింగాలు వస్తే మావి. మట్టివస్తే మీవి” అని ముస్లింలను రెచ్చగొట్టేలా బిజెపి తెలంగాణ రాష్ర్ట అధ్యక్షులు, ఆ పార్టీ ఎంపి బండిసంజయ్ అన్నప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ గానీ, దేశాధినేత ప్రధాని నరేంద్ర మోడీ గానీ ఎందుకు వారించలేదు!? ఈ సంఘపరివార్ నాయకుల వ్యవహారం ఎలా ఉందంటే ‘గిల్లి జోల పాడే’ లా ఉంది.

రాఘవశర్మ
9493226180

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News