వివిధ దశల్లో రూ.6వేల కోట్ల పనులు
పాతబస్తీ డెవలప్మెంట్కు 13వేల కోట్లు ఖర్చు చేశాం,
ట్రాఫిక్ సమస్యను అధిగమించే దిశగా చర్యలు
భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు
అన్నివిధాలా కృషి
శాసనసభలో మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నట్లు మంత్రి రాష్ట్ర ఐటి, మునిసిపల్ శాఖ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కెటిఆర్ సమాధానమిచ్చారు. నగరాభివృద్ధికి రూ.30 వేల కోట్లు కేటాయించినట్లు వివరించారు. అందులో 6 వేల కోట్ల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఎస్ఆర్డిపి ప్రాజెక్టు(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి) కింద చేపట్టిన పనులను మంత్రి కెటిఆర్ సభ ముందు ఉంచారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
ఎస్ఆర్డిపి కింద 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్పాష్లు, 3 ఆర్యూబీ, ఒక వంతెనతో పాటు ఒక కేబుల్ బ్రిడ్జిని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కింద మొత్తం 18 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి ఫ్లై ఓవర్లు, అండర్పాస్లు నిర్మించామన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు నగరంలో ఈ ప్రాజెక్టు కింద పలు అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. జిహెచ్ఎంసీలో భూసేకరణ కోసం చర్యలు చేపట్టామన్నారు. హైదరాబాద్ కలెక్టర్కు ప్రత్యేక బాధ్యతలు అప్పజెప్పిన తర్వాత భూసేకరణ వేగవంతంగా జరుగుతోందని కెటిఆర్ తెలిపారు. ప్ర జా రవాణాను మెరుగుపరిచేందుకు మెట్రోతో పాటు ఆర్టీసిని అభివృద్ధి చేస్తున్నామన్నారు.
పాతబస్తీలో రోడ్ల అభివృద్ధికి రూ.713 కోట్లు వెచ్చించాం..
హదరాబాద్లో అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు అనేక నిధులు ఖర్చుపెట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. కేవలం పాతబస్తీకే ఈ ఐదేళ్లలో రూ.713 కోట్లు ఖర్చు పెట్టి రోడ్ల విస్తరణ చేపట్టాం. సాధారణ రోడ్ల కింద రూ.477 కోట్లు, ఎస్ఆర్డిపి కింద రూ.223 కోట్లు, లింకు రోడ్ల కింద రూ.8 కోట్లు ఖర్చు పెట్టామని తెలిపారు. నగరంలోని రోడ్లను విస్తరిస్తామని, పాతనగరం, కొత్తనగరం అన్న తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో రోడ్ల విస్తరణతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు.
సమస్యను అధిగమించే దిశగా చర్యలు..
నగరంలో ఉన్న వాహనాలన్నీ ఒక్కసారిగా రోడ్ల మీదకు వస్తే రోడ్లన్నీ పూర్తిగా నిండిపోయి హైదరాబాద్ గ్రిడ్లాక్ అవుతుందన్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రాఫిక్ రద్దీని తగ్గించి ప్రజా రవాణా మెరుగుపర్చేందుకు కాలుష్య సమస్యలను తగ్గించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి కెటిఆర్ తెలిపారు. త్వరలోనే నగరం పరిధిలోని ఎంఎల్ఎలతో సమావేశం నిర్వహించి నగర అభివృద్ధికి వారి సలహాలు, సూచనలు తీసుకోనున్నట్లు మంత్రి కెటిఆర్ వెల్లడించారు.