మనతెలంగాణ/పెద్దపల్లి: జిల్లాలోని ధర్మారం మండలం, దొంగతుర్తిలో సోమవారం అర్థరాత్రి సిలిండర్ పేలి తల్లి, కొడుకు సజీవ దహనమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దొంగతుర్తికి చెందిన గొట్టె నారాయణకు భార్య యశోద(45)తో పాటు కుమారుడు రాహుల్(18), కూతురు రాణి(13)లు ఉన్నారు. కొడుకు రాహుల్ ధర్మారంలో ప్రథమ సంవత్సరం చదువుతుండగా, కూతురు రాణి రామగుండంలోని గురుకుల విద్యాలయంలో ఎనిమిదో తరగతి చదువుతుంది. సోమవారం రాత్రి తల్లి, కొడుకులు వంటరూమ్లో నిద్రిస్తుండగా నారాయణ ముందు రూమ్లో నిద్రిస్తున్నాడు. అర్థరాత్రి సమయంలో ఒక్కసారిగా గ్యాస్ లీకై సిలిండర్ పేలడంతో యశోద, రాహుల్లు నిద్రలోనే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనను గుర్తించి స్థానికులు వెంటనే ఫైర్ సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు.
ఫైర్ ఇంజన్ మంటలార్పగా, స్థానికుల సహాయంతో పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు. సిలిండర్ పేలిన సమయంలో కాలిబూడిదైన యశోద, రాహుల్ మృతదేహాలను మంగళవారం ఉదయం పోలీసులు వెలికి తీసి పోస్ట్మార్టంకు పంపించారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఎసిపి హబీబ్ఖాన్, సిఐ ప్రదీప్కుమార్ సందర్శించారు. సిలిండర్ పేలడంతోనే తల్లి కొడుకులు మృత్యువాత పడ్డారని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎసిపి హబీబ్ఖాన్ తెలిపారు. తల్లి కొడుకుల మృతితో దొంగతుర్తిలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై గ్రామంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో నారాయణ తీరుపై గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ దిశగా విచారణ నిర్వహిస్తున్నారు.
mother, son burnt alive due to Cylinder blast in Peddapalli