Tuesday, April 30, 2024

సంక్రాంతి బరిలో ఐదుగురు అగ్రహీరోల సినిమాలు…

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ కు సంబంధించి ఈసారి సంక్రాంతికి ఒక ప్రత్యేకత ఉంది. ఐదు భారీ చిత్రాలు సంక్రాంతి బరిలో నువ్వా నేనా అంటూ పోటీ పడబోతున్నాయి. ఒకటి రెండు రోజుల వ్యవధిలో విడుదలయ్యే ఈ సినిమాలకు చాలినన్ని థియేటర్లు లేవు. దీనివల్ల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనిని పసిగట్టి ఫిలిం చాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు ఈ ఐదు చిత్రాల నిర్మాతలతో ఇటీవల సమావేశమయ్యారు. అందరూ సంక్రాంతినాడే తమ సినిమాలను విడుదల చేయకుండా కొందరు వాయిదా వేసుకోవాలని కోరారు. అయితే దిల్ రాజు విజ్ఞప్తికి ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. దీంతో సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. దిల్ రాజు కూడా విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా నిర్మిస్తున్నారు. దీనిని కూడా సంక్రాంతికే విడుదల చేయాలని ఆయన ప్లాన్ చేశారు. అయితే పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయన తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం జనవరి 12న రిలీజ్ అవుతోంది. అదే రోజు దర్శకుడు ప్రశాంత్ వర్మ తేజ సజ్జా హీరోగా రూపొందించిన పాన్ ఇండియా మూవీ హను-మాన్ విడుదల అవుతోంది. ఆ మర్నాడు.. అంటే జనవరి 13న  రవితేజ హీరోగా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తీసిన ఈగల్ సినిమా, శైలేష్ కొలను దర్శకత్వంలో హీరో వెంకటేశ్ నటించిన సైంధవ్ రిలీజ్ అవుతున్నాయి. జనవరి 14న నాగార్జున నటించిన నా సామిరంగ సినిమా విడుదలవుతోంది. దీనికి విజయ్ బిన్నీ దర్శకుడు.

మరో విచిత్రమేమిటంటే తమిళనాడులోనూ ఇలాంటి పోటీ నెలకొనడం. విజయ్ సేతుపతి నటించిన మెర్రీ క్రిస్మస్ మూవీ, ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ నటించిన అయలాన్ జనవరి 12నే విడుదల అవుతున్నాయి. అయితే వీటిని తెలుగులోకి డబ్ చేసి ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయమై స్పష్టత లేదు. ఒకవేళ ఇవి కూడా తెలుగునాట సంక్రాంతికే విడుదల అయితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News