ముంబయి: ఇక్కడి ఒక హోటల్లో ఉరి వేసుకుని మరణించిన దాద్రా-నగర్ హవేలీ లోక్సభ సభ్యుడు మోహన్ దేల్కర్ మృతదేహాన్ని పోస్టు మార్టమ్ అనంతరం ఆయన కుటుంబ సభ్యులకు అందచేసినట్లు పోలీసు అధికారి ఒకరు మంగళవారం తెలిపారు. ఆయన మరణానికి గల కారణాలు ఇంకా తెలియరావలసి ఉందని ఆయన చెప్పారు. 58 సంవత్సరాల దేల్కర్ కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా-నగర్ హవేలీకి ఇండిపెండెంట్ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దక్షిణ ముంబయిలోని మరైన్ డ్రైవ్ ప్రాంతంలోని ఒక హోటల్ గదిలో ఫ్యానుకు ఉరివేసుకున్న ఆయన మృతదేహం పోలీసులకు సోమవారం లభించింది. గుజరాతీలో రాసిన ఒక లేఖ కూడా గదిలో లభించింది. ప్రభుత్వ జెజె ఆసుపత్రిలో పోస్టుమార్టమ్ నిర్వహించిన అనంతరం దేల్కర్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అందచేశారు. దేల్కర్ వరుసగా ఏడుసార్లు అదే నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.
MP Delkar’s body handed over to family members