ఐఎఎస్ అధికారులకు రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశం
జైపూర్: ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ కార్యాలయాలను సందర్శించినపుడు గౌరవసూచకంగా లేచినిలబడి స్వాగతం పలకాలని ఐఎఎస్ అధికారులను రాజస్థాన్ ప్రభుత్వం ఆదేశించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చినపుడు మర్యాదపూర్వకంగా వారికి స్వాగతం పలికి వారు నిష్క్రమించేటపుడు దగ్గరుండి సాగనంపాలని రాజస్థాన్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రాజీవ స్వరూప్ వివిధ శాఖలకు చెందిన అధికారులకు ఆదేశాలతో కూడిన సర్కులర్ పంపారు. అదే విధంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపే లేఖలను కూడా సత్వరమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కూడా సిఎస్ అదేశించారు.
ఎంపీలు, ఎమ్మెల్యేలు పంపే ఫిర్యాదులపై సత్వరమే పరిష్కరించి 30 రోజుల్లోపల వారికి ప్రత్యుత్తరం ఇవ్వాలని, ఫోన్ ద్వారా వారు పంపే సందేశాలపై కూడా అదేవిధంగా స్పందించాలని సిఎస్ సెప్టెంబర్ 23న జారీచేసిన తన సర్కులర్లో ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలకు జవాబివ్వాలని ఆదేశిస్తూ గతంలో తాను జారీచేసిన ఆదేశాలు సక్రమంగా అమలుకావడం లేదన్న విషయం తన దృష్టికి వచ్చిందని సిఎస్ పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలతో వినమ్రంగా, మర్యాదపూర్వకంగా మసలుకోవాలని కూడా ఆయన ఆ సర్కులర్లో అధికారులను ఆదేశించారు. సుపరిపాలనను అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్షమని, ఎంపీలు, ఎమ్మెల్యేల లేఖలపై సత్వరమై స్పందించి చర్యలు తీసుకోవడానికే తాను తాజాగా ఈ సర్కులర్ జారీచేస్తున్నానని సిఎస్ పేర్కొన్నారు.