Sunday, May 19, 2024

మయన్మార్‌లో ప్రజాసైనిక సేవా చట్టం అమలు

- Advertisement -
- Advertisement -

నైపిడావ్ ( మయన్మార్ ) : మయన్మార్ లోని జుంటా సైనిక ప్రభుత్వం ఈనెల 10 నుంచి ప్రజాసైనిక సేవా చట్టాన్ని అమలు లోకి తెచ్చింది. 18 నుంచి 35 ఏళ్ల లోపు పురుషులు, 18 నుంచి 27 ఏళ్ల లోపు మహిళలు తప్పనిసరిగా ఈ చట్టం కింద కనీసం రెండేళ్లయినా మిలిటరీ ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేయాలని స్పష్టం చేసింది. ఈమేరకు శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశాన్ని రక్షించుకునే విద్యుక్తధర్మం కేవలం సైనికులే కాకుండా పౌరులందరికీ ఉందని అందువల్ల ప్రతిపౌరుడు ఈ చట్టాన్ని కచ్చితంగా పాటించాలని జుంటా అధికార ప్రతినిధి జా మిన్ టున్ మీడియాకు వెల్లడించారు. స్వయం ప్రతిపత్తిని కోరుతూ దేశంలో అనేక చోట్ల సాయుధ తిరుగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో జుంటా ప్రభుత్వం ఈ చట్టాన్ని తప్పనిసరి చేయడం గమనార్హం.

2021లో ఒక వ్యూహం ద్వారా అప్పటి ప్రభుత్వాన్ని మిలిటరీ కూల్చివేసిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ప్రజాస్వామ్య అనుకూల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇదివరకటి మిలిటరీ ప్రభుత్వం ఈ చట్టాన్ని 2010లో రూపొందించినా అమలు లోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఎలాంటి వివరాలు లేవు. అయితే అవసరమైన నిబంధనలు, మార్గదర్శకాలు, విధానాలు, ప్రకటనలు, నోటిఫికేషన్లు, ఆదేశాలు ఇవన్నీ తరువాత జుంటా రక్షణ మంత్రిత్వశాఖ జారీ చేస్తుందని జుంటా ఒక ప్రకటనలో పేర్కొంది. 2010 నాటి చట్టంలో అత్యవసర పరిస్థితుల్లో ఈ సర్వీస్ ఐదేళ్ల వరకు పొడిగించడమౌతుందని, ఎవరైతే ఈ సమన్లు విస్మరిస్తారో ఆ కాల పరిధి వరకు జైలుపాలవుతారని మయన్మార్ మిలిటరీ ప్రభుత్వం హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News