Monday, May 6, 2024

బిసిలకు చెప్పింది ఘనం… పెంచింది కొంచెం

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర బడ్జెట్లో బిసి సబ్ ప్లాన్ ఊసేది?
ఫీజు రియింబర్స్‌మెంట్ బకాయీలకు నిధులు ఎలా ?
బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్

మన తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ బిసిలకు ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పింది ఘనం చేసింది కొంచెమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బిసి సంక్షేమానికి ప్రతి ఆర్థిక సంవత్సరం ఇరవై వెల కోట్లు కేటాయిస్తామని ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు కేటాయిస్తామని చెప్పారని, మాహత్మ జ్యోతిబా పూలే పేరుతో బిసి సబ్ ప్లాన్ తెస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చడం కాంగ్రెస్ ప్రభుత్వానికి తగదు అని జాజుల అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 60 శాతం జనాభా ఉన్న బిసిల సంక్షేమానికి రూ. 8000 కోట్లు కేటాయించారని ఇవి బిసిల అభివృద్ధికి ఏమాత్రం సరిపొవని వ్యాఖ్యానించారు. గత సంవత్సరం కంటే బిసిల బడ్జెట్ పెంచినప్పటికీ ఇది ఏమాత్రం సరిపోదని జాజుల అన్నారు. ఈ ఎనిమిది వేల కోట్లలో బిసిల సంక్షేమమే కాకుండా ఇందులో ఈబిసి పేరుతో అగ్రకులాల సంక్షేమం, కళ్యాణ లక్ష్మి నిధులు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తులం బంగారం కుడా ఈ బడ్జెట్ నుండే ఇవ్వాల్సి వస్తుందని ఆయన అన్నారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలుగా ఫీజుల రియింబర్స్‌మెంట్, స్కాలర్ షిప్ లు, బిసి, ఈబిసి విద్యార్థులకు ఇవ్వకపోవడంతో రూ. 3400 కోట్లు ఫీజుల రియింబర్స్‌మెంట్ బకాయిలకే పోతాయని ఆయన అన్నారు. కళ్యాణ లక్ష్మి, ఈబిసి స్కాలర్‌షిప్స్ ఇవన్నీ పోను బిసిల అభివృద్ధికి ఇంకా ఏమి మిగులవని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కామారెడ్డిలో ఇచ్చిన బిసి డిక్లరేషన్ ప్రకారం బిసిల సంక్షేమ బడ్జెట్ రూ. 8000 కోట్ల నుండి రూ. 20 వేల కోట్లకు పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బిసి గురుకులాల సొంత భవనాలకు 1,500 కోట్లు కేటాయించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో బిసిల సంక్షేమానికి కొంత నిధులు పెంచినా మ్యానిఫెస్టో ప్రకారం పెంచలేదని ఇప్పటికైనా బడ్జెట్‌ను సవరించి బిసి సంక్షేమ బడ్జెట్ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News