సిపిఐ(ఎం) నాయకురాలు బృందాకరత్
ముంబయి: ఎన్డిఎను జాతి విధ్వంసక కూటమి అని సిపిఐ(ఎం) పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకరత్ అభివర్ణించారు. మహాకూటమి తరఫున బీహార్లో ప్రచారం నిర్వహిస్తున్న బృందాకరత్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. జెడి(యు), బిజెపి కూటమిని ఓడించాలని బీహార్ ఓటర్లు ఈసారి గట్టిగా నిర్ణయించుకున్నారని ఆమె అన్నారు. కొవిడ్19 నియంత్రణలో భాగంగా విధించిన లాక్డౌన్, కేంద్రంలోని ఎన్డిఎ అనుసరించిన విధానాల వల్ల ఎక్కువగా నష్టపోయింది వలస కార్మికులేనని ఆమె అన్నారు. బీహార్కు చెందిన లక్షలాది వలస కార్మికులు దేశంలోని దూర ప్రాంతాల్లో చిక్కుకొని ఉన్న సమయంలో ముఖ్యమంత్రి నితీశ్కుమార్ వారి పట్ల నిర్దయగా వ్యవహరించారని బృందాకరత్ విమర్శించారు. వారి రోదనను నితీశ్ ప్రభుత్వం వినిపించుకోలేదని, ఉద్యోగాలు కల్పిస్తానన్న హామీని నిలబెట్టుకోకపోవడంతో తిరిగి వారంతా వలస బాట పట్టారని బృందాకరత్ గుర్తు చేశారు. సామాన్య ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ విధానాలతో బరిలో నిలిచిన మహా కూటమికి భారీ విజయం లభిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.