న్యూఢిల్లీ: నీట్, జెఇఇ-మెయిన్స్ పరీక్షల నిర్వహణపై గతంలో తాము ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ ఆరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు దాఖలు చేసిన అభ్యర్థనలను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం రివ్యూ పిటిషన్ల విచారణ స్వీకరణకు సంబంధించిన అభ్యర్థనలను చాంబర్లో పరిశీలించడంతోపాటు ఓపెన్ కోర్టులో ఈ రివ్యూ పిటిషన్లను విచారించాలన్న దరఖాస్తును కూడా తోసిపుచ్చింది. రివ్యూ పిటిషన్లను విచారణకు అనుమతించాలన్న కోరుతూ దాఖలైన దరఖాస్తులను పరిశీలించామని, ఈ పిటిషన్లలో విచారణార్హత లేదని భావించడంతో వాటిని కొట్టివేశామని ధర్మాసనం తన ఉత్తర్వులో పేర్కొంది. రివ్యూ పిటిషన్లు దాఖలు చేసిన ప్రతిపక్ష రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్(మలోయ్ ఘటక్), జార్ఖండ్(రామేశ్వర్ ఓరాన్), రాజస్థాన్(రఘు శర్మ), ఛత్తీస్గఢ్(అమర్జిత్ భగత్), పంజాబ్(బిఎస్ సిధు), మహారాష్ట్ర(ఉదయ్ రవీంద్ర పావంత్) ఉన్నాయి.
నీట్, జెఇఇ పరీక్షలపై రివ్యూ పిటిషన్ల కొట్టివేత
- Advertisement -
- Advertisement -
- Advertisement -