బోల్పూర్: రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ఆ రాష్ట్రంలో రెండు రోజులుగా పర్యటన జరుపుతున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం బీర్భూమ్ జిల్లా బోల్పూర్లో జరిగిన భారీ రోడ్షోలో పాల్గొన్నారు. బెంగాలీ సంస్కృతి, సాహిత్యాలకు ఐకాన్ అయిన రవీంద్రనాథ్ టాగూర్తో అనుబంధం ఉన్న ఈ పట్టణంలో రోడ్షో నిర్వహించడం ద్వారా బిజెపి తన బలాన్ని ప్రదర్శించింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా ముఖ్యమంత్రి , తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీపై నిప్పులు చెరిగారు. నా జీవితంలో నేను ఎన్నో రోడ్షోలలో పాల్గొనడంతో పాటుగా ఎన్నో నిర్వహించా. కానీ ఇలాంటి రోడ్షోను ఎప్పుడూ చూడలేదు. పశ్చిమ బెంగాల్ ప్రజలు మమతా దీదీపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఈ ర్యాలీ చెబుతోంది. వాళ్లు మార్పు కోరుకుంటున్నారు.
మోడీకి ఒక్క సారి అవకాశమివ్వండి. అయిదేళ్లలో సోనార్ బంగ్లాను తయారు చేసి చూపిస్తాం’ అని ఆయన అన్నారు. బెంగాల్ ప్రజలు రాజకీయ హింస. దోపిడీ, బంగ్లాదేశీల చొరబాట్లనుంచి విముక్తి కోరుకుంటున్నారని అమిత్ షా అన్నారు. ‘బెంగాల్ను అభివృద్ధినుంచి దారి తప్పించారు. వచ్చే సారి బిజెపికి అధికారం ఇవ్వండి. మేము మీకు అభివృద్ధిని తీసుకు వస్తాం’ అని కూడా ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన జనాన్ని ఉద్దేశించి రాష్ట్రంలో ఏమయినా అభివృద్ధి జరిగిందా అని ప్రశ్నించగా, జనం గట్టిగా ‘ లేదు’ అని అంటూ సమాధానమిచ్చారు. 2021లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు తమ బలాన్ని ప్రదర్శించడానికి వేదికగా బిజెపి ఈ రోడ్ షోను మార్చుకుంది. డాక్ బంగ్లా మైదానంలో ఆదివారం మధ్యాహ్నం 3.10 గంటలకు మొదలైన ఈ రోడ్షో బోల్పూర్ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ ర్యాలీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంనుంచి అమిత్ షా ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు. ఆయన వెంట ఈ ర్యాలీలో బెంగాల్ బిజెపికి చెందిన పలువురునేతలు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు అమిత్ షా విశ్వభారతి విశ్వవిద్యాలయాన్ని సందర్శించి రవీంద్రనాథ్ టాగూర్కు నివాళులర్పించారు. ఆయన మధ్యాహ్నం ఓ జానపద కళాకారుడి ఇంట విందుకు కూడా హాజరయ్యారు.