వాషింగ్టన్ : అమెరికా ప్రభుత్వ శాఖలు, సంస్థలపై ఇటీవల జరిగిన సైబర్ దాడులకు కారకులెవరో స్పష్టంగా తెలియనప్పటికీ విరుద్ధ ప్రకటనలు వెలువడుతున్నాయి. ఈ దాడుల వెనుక రష్యాయే ఉందనేది సుస్పష్టమని ఆ దేశ రక్షణ మంత్రి మైకే పాంపియో శుక్రవారం ప్రకటించగా, దీనికి విరుద్ధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం రష్యాకాదు చైనాయే కారణమని కొత్త వాదన లేవనెత్తారు. ఈ దాడివల్ల ప్రభుత్వ శాఖలే కాకుండా ప్రైవేట్ నెట్వర్క్లకు కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ప్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ హెచ్చరించింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఈ సైబర్ దాడి గురించి బూటకపు మీడియా లోనే ఎక్కువగా ప్రచారమౌతోందని, ప్రచారం జరుగుతున్నట్టు కాక, అదంతా నియంత్రణలో ఉందని ట్రంప్ ట్వీట్ చేశారు.
అంతేకాదు చైనాయే కారణమై ఉండవచ్చని కూడా మీడియా ప్రచారం చేస్తోందని ఆయన వివరించారు. పదవీకాలం కొద్ది రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ట్రంప్ వ్యవహార శైలి కొన్ని అంశాల్లో చర్చనీయాంశంగా ఉంటోంది. 2016 అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ప్రమేయం ఉందనే వాదనలను ట్రంప్ తిరస్కరించారు. దీనికి ఒబామా ప్రచారమే కారణమని ఆయన ఆరోపించారు. జి 7 దేశాల గ్రూపులో మళ్లీ రష్యా చేరడానికి ట్రంప్ మద్దతు ఇచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అమెరికా అధికార యంత్రాంగం మాత్రం ఈ దాడులపై స్పష్టం చేయడం లేదు. ఇదింకా దర్యాప్తులో ఉందని చెబుతున్నాయి. అమెరికా చరిత్రలో ఈ దాడులు అత్యంత ఆధ్వాన్న పరిస్థితిగా వ్యాఖ్యానించాయి.