Monday, April 29, 2024

గ్యాస్ సిలిండర్ లీక్.. మంటల్లో 9 మంది మృతి

- Advertisement -
- Advertisement -

Nine killed in gas cylinder leak fire in Gujarat

మృతులంతా మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబ సభ్యులు
మృతుల్లో నలుగురు చిన్నారులు
అహ్మదాబాద్‌లో విషాదం

అహ్మదాబాద్: గుజరాత్‌లో ఘోరం జరిగింది. నగర శివార్లలోని ఓ ఇంట్లో గ్యాస్ లీక్ కారణంగా జరిగిన పేలుళ్లలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నలుగురు చిన్నారులున్నారు. వీరంతా మధ్యప్రదేశ్‌కు చెందిన కార్మికులు, వారి కుటంబ సభ్యులు కావడం గమనార్హం. ఈ నెల 20వ తేదీ రాత్రి జరిగిన ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన పది మందిలో ఎనిమిది మంది గత రెండు రోజుల్లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా, శనివారం మరొకరు మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని అస్లాలి పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పిఆర్ జడేజా శనివారం చెప్పారు. వీరంతా ఒక చిన్న గదిలో నిద్రిస్తున్న సమయంలో వంటింట్లో సిలిండర్‌నుంచి గ్యాస్ లీక్ కావడం మొదలైంది. పొరుగు వ్యక్తి ఒకరు గమనించి అప్రమత్తం చేయడం కోసం తలుపులు తట్టడంతో నిద్రలేచిన వ్యక్తి లైటు వేయడంతో స్పార్క్ వచ్చి ఒక్క సారిగా భారీ పేలుడు సంభవించింది.

ఈ ప్రమాదంలో అప్రమత్తం చేయడానికి వచ్చిన వ్యక్తి కూడా గాయపడ్డాడు. తీవ్ర గాయాలైన పది మందిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం ముగ్గురు, శుక్రవారం అయిదుగురు, శనివారం ఉదయం మరొకరు చనిపోయారు. మృతులను రాంప్యారి అహిర్వార్ (56), రాజుభాయ్ అహిర్వార్ (31), సోను అహిర్వార్ (21),సీమా అహిర్వార్ (25), సర్జు అహిర్వార్(22), వైశాలి (7), నితేశ్ (6), పాయల్(4), ఆకాష్(2)లుగా గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాకు చెందిన వారని ఆయన చెప్పారు. గాయపడిన మరో వ్యక్తి కుల్‌సిన్హ్ భైర్వా(30) పరిస్థితి విషమంగా ఉందని, ఈయన రాజస్థాన్‌లోని కరైలిలోని కుడ్గావ్‌కు చెందిన వాడని ఇన్‌స్పెక్టర్ చెప్పారు. చనిపోయిన వారి మృతదేహాలను వారి స్వగ్రామానికి పంపిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News