న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనాపై పోరాటం చేస్తున్న నేపథ్యంలో ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండేందుకు గురువారం కేంద్ర ప్రభుత్వం రూ. లక్ష 70 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. కరోనా ప్రభావం వలన నగరాలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే 80 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ పథకం ద్వారా ఈ ప్యాకేజీని అందించనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో ప్రజలెవరూ బాధపడకుండా చూడాలన్నారు. ఈరోజు ఢిల్లీలో నిర్మాలా సీతారామన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ”ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు. పేదల కోసం గరీబ్ కల్యాణ్ పేరుతో రూ.లక్ష 70 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నం. అన్ని రంగాల వారిని ఆదుకుంటాం. కరోనా ప్రభావంతో ఉపాధి కోల్పోయిన వారికి ఆర్థిక సాయం అందిస్తాం. దేశంలో ఎవరూ ఆకలితో ఉండకూడదు. నగదు బదిలీ, ఆహార భద్రతపై దృష్టి పెట్టాం. పేదల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తాం. వచ్చే 3 నెలల పాటు ప్రతీ వ్యక్తికి 10 కిలోల బియ్యం, గోధుమలు ఉచితంగా అందిస్తం. ప్రతీ ఇంటికి నెలకు కిలో పప్పు చొప్పున ఉచితంగా పంపిణీ చేస్తం. వచ్చే మూడు నెలల పాటు ఉచితం రెట్టింపు రేషన్ రెండు వాయిదాల్లో అందిస్తం. బియ్యం కావాలంటే బియ్యం, గోదుమలు కావాలంటే గోధుమలు ఇస్తం. ఉజ్వల పథకం కింద వంట గ్యాస్ మూడు నెలల పాటు నెలల పాటు ఉచితంగా అందిస్తాం. దేశంలో ఉన్న 20.5 కోట్లు గల మహిళల జన్ దన్ ఖాతాలో నెలకు రూ.500 చొప్పున నేరుగా సొమ్మును జమచేస్తం. కిసాన్ యోజన సమ్మాన్ లబ్ధిదారులకు మొదటి విడతగా రూ.2 వేలు అందిస్తం. నరేగా కింద దినసరి కూలీకి రూ.180 నుంచి రూ.202కు పెంచుతున్నం. నిరుపేద వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు రెండు వాయిదాల చొప్పున రూ.1000 అందజేస్తాం. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణం రూ.20 లక్షలకు పెంచుతున్నం. కరోనాను అరికట్టేందుకు అత్యవసర విధులు నిర్వహిస్తున్న వారికి రూ.50 లక్షల మెడికల్ ఇన్సూరెన్స్ ఇస్తం. వంద మందిలోపు ఉన్న కంపెనీల ఈపిఎఫ్ ఖాతాల్లో.. ఉద్యోగులు, కంపెనీల వాటా కేంద్ర 3 నెలల పాటు భరిస్తుంది. ఈపిఎఫ్ ఖాతా నుంచి 75 శాతం నగదును విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పిస్తాం” అని నిర్మలా సీతారామన్ చెప్పారు.
FN Nirmala Sitharaman Press Meet on Country Lockdown