వాషింగ్టన్: ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని ఆ దేశ అధ్యక్షుడు జోబైడెన్ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం(అమెరికా కాలమానం ప్రకారం) మిచిగన్ రాష్ట్రం కలమాజూలోని ఫైజర్ కంపెనీ టీకాల ఉత్పత్తి కేంద్రాన్ని బైడెన్ సందర్శించారు. తన ప్రభుత్వం వ్యాక్సిన్ల సరఫరాను వేగవంతం చేయడంపై దృష్టి సారించిందని బైడెన్ అన్నారు. వైరస్ కొత్త స్ట్రెయిన్లు వస్తున్నాయి. విజ్ఞానశాస్త్రం ఆధారంగా చేయగలగిందంతా చేస్తామని బైడెన్ అన్నారు. జులై చివరికల్లా 60 కోట్ల డోసులు పంపిణీ చేయాలని లక్షంగా నిర్ణయించుకున్నట్టు తెలిపారు. జులై 29 వరకల్లా టార్గెట్ పూర్తవుతుందని అంచనా అన్నారు. ప్రస్తుతం వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో పంపిణీ ఆలస్యమవుతోందని ఆయన తెలిపారు. కొన్ని రోజులుగా అమెరికాలో మంచు తుపాన్ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి వల్ల అధికంగా నష్టపోయింది అమెరికాయే. కేసులు, మరణాలు ఆ దేశంలోనే అధికంగా నమోదయ్యాయి.