Monday, May 6, 2024

ఈ నెల 16న విశాఖలో బిసిల మహా గర్జన : కృష్ణయ్య

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : వచ్చే -పార్లమెంటు ఎన్నికల నాటికి బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని,బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, జనగణనలో కుల గణన చేపట్టాలనే డిమాండ్లతో ఈ నెల 16న విశాఖలో బిసి గర్జన సదస్సు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆదివారం బిసి భవన్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి, ఢిల్లీ ఇంచార్జ్ కర్రీ వేణుమాధవ్, జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ అధ్యక్షతన సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో మహాగర్ఝన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంటులో ప్రతిపక్షాలు కుల గణన పై, బిసిలకు చట్ట సభలలో రిజర్వేషన్లపై రాజ్యాంగబద్ధ హక్కుల కోసం చర్చ జరపాలని కృష్ణయ్య కోరారు. కుల గణన జరుపాలని 8 రాష్ట్ర అసెంబ్లీలు తీర్మానాలు చేశాయని, 16 రాజకీయ పార్టీలు మద్దతు పలికాయని ఆయన తెలిపారు. డిమాండ్ల సాధన కోసం పార్లమెంట్ ను స్తంబింప చేసి చిత్తశుద్ది నిరూపించుకోవాలని ఆయన రెండు రాష్ట్రాలకు చెందిన టిఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సిపి, కాంగ్రెస్ పార్లమెంటు సభ్యులకు పిలుపునిచ్చారు. ఇతర సమస్యలపై రోజు పార్లమెంటులో ఉద్యమాలు చేస్తున్న మాదిరిగా కుల గణన పై కూడా పార్లమెంటులో చర్చ చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఖర్చు లేకుండా జనగణన లో కుల గణన చేసే అవకాశం ఉన్నా బిసి వ్యతిరేక వైఖరితో డిమాండును అంగీకరించడం లేదన్నారు. పార్లమెంటును ప్రతిపక్షాలు స్తంబింప జేయాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ బి.సి కుల గణన పై ఇంతవరకు విధాన ప్రకటన జారి చేయలేదన్నారు.

పార్లమెంట్ లో బిసి బిల్లు ప్రవేశ పెట్టి, చట్ట సభలలో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్ల లో రిజర్వేషన్లు కల్పించాలని, ఇందుకు రాజ్యంగ సవరణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. . పంచాయితీ రాజ్ సంస్థలో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 50 శాతానికి పెంచాలని, కేంద్రంలో బిసి లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని ఆయన కోరారు. బిసిలకు విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రిమిలేయర్ ను తోలగించాలని, కేంద్రం విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను బి.సి ల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతం కు పెంచాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి మాదిరిగా బిసి లకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టాన్ని తేవాలన్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలలో, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉదోగాలను భర్తీ చేయాలనీ కోరారు. 2 లక్షల కోట్లతో బి.సి సబ్ ప్లాన్ ఏర్పాటు చేయాలనీ, కేంద్రంలో బి.సి విద్యార్థులకు పూర్తి స్థాయిలో సాచురేషన్ పద్ధతిలో ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్ షిప్, ఫీజుల రియంబర్స్ మెంట్ స్కీము ప్రవేశపెట్టాలని, బి.సి ల విద్య,ఉద్యోగాల రిజర్వేషన్లు 25 శాతం నుండి 50 శాతంకు పెంచాలని, ప్రైవేటు రంగంలో ఎస్‌సి, ఎస్‌టి. బి.సి రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని, హైకోర్టు-సుప్రీమ్ కోర్టు జడ్జిల నియామకాలలో జనాభా ప్రకారం ఎస్‌షి, ఎస్‌టి బిసి సి రిజర్వేషన్లు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, వేముల రామకృష్ణ, బిి. వెంకట్, ఆళ్ల రామకృష్ణ, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News