Friday, May 3, 2024

ఇంటింటికి తిరుగుతూ వంద శాతం ఓటరు నమోదు జరిపించాలి

- Advertisement -
- Advertisement -

నర్వ: అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా బూత్ లెవల్ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. వారం రోజుల పాటు ప్రతి నివాస ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ , ఓటరు జాబితాలో పేర్లు లేని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయించాలని అన్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు , మార్పులు .. చేర్పులకు వీలుగా పోలింగ్ బూత్‌ల పరిధిలో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో కలెక్టర్ ఆదివారం నర్వ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంతో పాటు పలు పోలింగ్ బూత్‌లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

బీఎల్‌ఓలు, ఎన్నికల అధికారులు అందుబాటులో ఉన్నారా ..? అని ఆరా తీసిన కలెక్టర్ , అన్ని నియోజకవర్గం పరిధిలో హాజరును పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ప్రత్యేక శిబిరాల సందర్భంగా ఎంత మంది పేర్లు నమోదు చేసుకున్నారు. వారిలో 18- సంవత్సరాల వయస్సు కలిగిన వారు ఎంత మంది ఉన్నారు, వారి వద్ద నుండి సేకరించిన ధృవీకరణ తదితర వివరాలను కలెక్టర్ ఆరా తీశారు.

ఓటరు జాబితాలో పేర్లు తోలగించే విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, మృతి చెందిన వారి మరణ ధృవీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యుల నుండి సేకరించి క్షుణ్ణంగా పరిశీలించాలని హితవు పలికారు. తద్వారా వారు పోలింగ్ సమయంలో గందరగోళానికి గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోగల్గుతారని అన్నారు. కాగా ప్రత్యేక శిబిరాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ వెంట అధికారులు, ఎన్నికల విభాగం సిబ్బంది ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News