Friday, May 3, 2024

విపక్షాల కూటమి పేరు ‘ఇండియా’

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బిజెపిని ఓడించడమే ఏకైక లక్షంగా నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశం మంగళవారం ముగిసింది. బెంగళూరు వేదికగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఈ సమావేశంలో మొత్తం 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. సమావేశం అనంతరం విపక్ష నేతలంతా సంయుక్తంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

విపక్షాల కూటమికి INDIA( ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయెన్స్)గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ పేరును 26 పార్టీలు అంగీకరించినట్లు చెప్పారు.‘ ఈ సమావేశంలో 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేశాం.ప్రతిపక్షాల తదుపరి సమావేశాన్ని ముంబయిలో నిర్వహిస్తాం. ఈ భేటీలో సమన్వయ కమిటీ సభ్యుల పేర్లను ప్రకటిస్తాం. సమావేశం ప్పుడు జరిగేఈ త్వరలోనే ప్రకటిస్తాం’ అని ఖర్గే చెప్పారు.

ప్రచార నిర్వహణ కోసం ఢిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, వేర్వేరు అంశాల కోసంనిర్దిష్ట కమిటీలను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సమావేశంలో ఒక ఉమ్మడి ప్రకటనను కూడా ఆమోదించినట్లు ఖర్గే తెలిపారు.ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశాన్ని కూడా ముంబయిలో జరిగే సమావేశంలో సమన్వయ కమిటీ నిర్ణయిస్తుందని ఖర్గే చెప్పారు. సీట్ల సర్దుబాటుపైన కూడా ఆ రోజు చర్చిస్తామన్నారు. ఈ సందర్భంగా ఖర్గే ప్రధాని నరేంద్ర మోడీపైన తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యమైందని, బిజెపి ప్రభుత్వం దాన్ని నాశనం చేస్తోందని ఖర్గే ఆరోపించారు.

‘ సిబిఐ, ఇడి వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రతిపక్ష నేతలపై దాడులు చేస్తోంది.దేశ ప్రయోజనాల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ఉండాలి. అందుకే మేమంతా ఏకతాటిపైకి వచ్చాం. పాట్నాలో జరిగిన భేటీకి 16 పార్టీలు వస్తే ఇవ్వాల్టి సమావేశంలో 26 పార్టీల నేతలు పాల్గొన్నారు. ఎన్‌డిఎ భేటీలో 30 పార్టీలు సమావేశమవుతున్నట్లు ప్రచారం చేస్తున్నారు. ఇసి గుర్తించిన పార్టీలు వారి భేటీకి వచ్చాయా లేదా అనేది తెలియదు. ప్రతిపక్షాలను చూసి ప్రధాని మోడీ భయపడుతున్నారు’ అని ఖర్గే బిజెపిపై మండిపడ్డారు. తమ మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయని, అయితే దేశ ప్రయోజనాల దృష్టా వాటన్నిటినీ పక్కన పెట్టి తామంతా ఒక్కటి అవుతున్నామని చెప్పారు. తామంతా కలిసికట్టుగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో పోరాడుతామని, విజయం సాధిస్తామని ఖర్గే ధీమాగా చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News