Tuesday, April 30, 2024

గుజరాత్ కసాయి ప్రధాని మోడీ : బిలావల్ భుట్టో

- Advertisement -
- Advertisement -
‘అనాగరిక వ్యాఖ్య’ అని ఖండించిన భారత్

న్యూఢిల్లీ: ఉసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ దాచి కాపాడిందని భారత్ చేసిన ఆరోపణపై పాకిస్థాన్ శుక్రవారం విరుచుకుపడింది. పాకిస్థాన్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ‘ఐక్యరాజ్యసమితి’ వద్ద మీడియాతో మాట్లాడుతూ “ఉసామా బిన్ లాడెన్ అయితే చనిపోయాడు, కానీ గుజరాత్‌లో అమాయకుల ప్రాణాలు తీసిన కసాయి ఇంకా బతికే ఉన్నాడు. అతడు ఇప్పుడు భారత ప్రధాని’ అన్నారు. దీనికి భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. ‘ఇదో అనాగరిక వ్యాఖ్య’ అని ఖండించింది. విదేశాంగ వ్యవహారాల ప్రతినిధి అరిదమ్ బాగ్చీ, “ ఈ వ్యాఖ్యలు సరికొత్త దిగజారుడు మాటలు, పాకిస్థాన్‌ను కూడా దిగజార్చేవే” అన్నారు.
“తూర్పు పాకిస్థాన్(నేటి బంగ్లాదేశ్)పై 1971లో ఊచకోతకు పాల్పడింది ఈ పాకిస్థానే. ప్రపంచంలోని అనేక నగరాల్లో జరిగిన తీవ్రవాద గ్రూపు దాడులను స్పాన్సర్ చేస్తు న్నది పాకిస్థానే. పాకిస్థాన్‌లో ఉన్నంత ఉగ్రవాదులు ఐక్యరాజ్యసమితిలోని మరే దేశంలోనూ లేరు” అని బాగ్చీ విమర్శించారు.

ఐక్యరాజ్యసమితి వద్ద ఏర్పాటు చేసిన ‘న్యూస్ కాన్ఫరెన్స్’లో బిలావల్ భుట్టో మాట్లాడుతున్నప్పుడు ఆయనని ఒక ప్రశ్న అడగడం జరిగింది. “ఉసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ దాచి కాపాడింది. అమెరికా ప్రత్యేక దళం రహస్య దాడితో అతడిని అంతమొందించింది” అని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అనడంపై బిలావల్‌ను ప్రశ్నించడం జరిగింది. కాగా 2002 గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత నరేంద్ర మోడీపై అమెరికా వీసా నిషేధం విధించింది.

2014లో ఎన్నికలు జరిగిన తర్వాత బిజెపి గెలిచాక ఆ నిషేధాన్ని ఎత్తేశారు. దానిపై బిలావల్ “ అమెరికాలో ప్రవేశం నిషేధించబడినప్పటికీ అతడు ప్రధాని కాగలిగాడు” అన్నారు. అంతేకాక బిలావల్ “ ఈ ప్రధాని ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి, విదేశాంగ మంత్రి కూడా ఆర్‌ఎస్‌ఎస్ మనిషే. అసలు ఆర్‌ఎస్‌ఎస్ ఏమిటి? అది హిట్లర్ ఎస్‌ఎస్ నుంచి ప్రేరణ పొందిన సంస్థ” అని వ్యాఖ్యానించాడు. బిల్కిస్ బానో కేసులో రేపిస్టులు, హంతకులైన వారిని క్షమాభిక్ష పెట్టి వదిలివేయడాన్ని కూడా బిలావల్ విమర్శించారు.
ఇదిలావుండగా న్యూయార్క్, ముంబై, పుల్వామా, పఠాన్‌కోట్, లండన్‌లో జరిగిన ఉగ్రదాడులకు పాకిస్థానే కారణమని భారత్ విమర్శించింది. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ పెంచిపోషిస్తోంది(స్పాన్సరింగ్,సపోర్టింగ్) అని భారత్ పేర్కొంది.
‘పాకిస్థాన్‌లో తయారవుతున్న ఉగ్రవాదాన్ని ఆపేయాలి. ఉసామా బిన్ లాడెన్ అమరజీవి అని పాకిస్థాన్ కీర్తిస్తోంది. లఖ్వీ, హఫీజ్ సయీద్, మసూద్ అజ్హర్, సాజిద్ మీర్, దావుడ్ ఇబ్రాహీమ్ వంటి తీవ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది” అని బాగ్చీ విమర్శించారు. ఇదిలావుండగా “ప్రధాని నరేంద్ర మోడీని తప్పుపట్టే తాహతు బిలావల్ భుట్టోకు ఉందా?” అని బిజెపి ప్రశ్నించింది.

బిలావల్ నేపథ్యం:
ఒకప్పుడు పాకిస్థాన్‌కు జుల్ఫికర్ అలీ భుట్టో ప్రధానిగా ఉండేవారు. ఆయన చనిపోయాక ఆయన కూతురు బెనజీర్ భుట్టో పాకిస్థాన్ ప్రధాని అయ్యారు. క్రీడాకారుడు ఆసిఫ్ అలీ జర్దారీ, బెనజీర్ భుట్టో సంతానమే ఈ బిలావల్ భుట్టో జర్దారీ. ప్రస్తుతం ఇతడు పాకిస్థాన్ 37వ విదేశాంగ వ్యవహారాల మంత్రిగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News