బ్లాక్ మార్కెట్ నియంత్రణకు ఆయిల్ కంపెనీలు రెడీ
హైదరాబాద్: వంటగ్యాస్ డెలివరీలో బ్లాక్ మార్కెట్ను నియంత్రించేందుకు ఆయిల్ కంపెనీలు రెడీ అయ్యాయి. వినియోగదారుల ధ్రువీకరణతోనే ఇకపై గ్యాస్ సిలిండర్ జారీ చేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గ్యాస్ బుకింగ్ చేసే సమయం లో వినియోగదారుడి మొబైల్ ఫోన్కు వచ్చే ఓటిపిని చెబితేనే డెలివరీ చేయనున్నాయి. డెలివరీ బాయ్కు ఓటిపి చెప్పిన వెంటనే తన వద్ద ఉండే ఫోన్లో నమోదు చేసుకుంటాడు. ఫలితంగా గ్యాస్ బుక్ చేసుకున్న వినియోగదారుడికి సిలిండర్ అందుతుంది. దీంతోపాటు ఆన్లైన్ ద్వారా నగదు చెల్లించే వెసులుబాటును కూడా ఆయిల్ కంపెనీలు కల్పిస్తున్నాయి.
అలాగే, గ్యాస్ బుకింగ్ల కోసం ఇటీవల యాప్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అమెజాన్ ద్వారా గ్యాస్ బుక్ చేసిన వారికి రూ. 50 రాయితీ లభిస్తుంది. మరోవైపు ఏజెన్సీలు కూడా డిజిటల్ బాట పట్టాయి. వినియోగదారుడి రిజిస్ట్రర్ మొబైల్ నెం. ద్వారా ఏజెన్సీల వాట్సాప్ నెంబరుకు ‘హాయ్’ అని మెసేజ్ పంపిన వెంటనే అటునుంచి స్పందన వస్తుంది. బుకింగ్ చేసుకోవడంతో పాటు నగదును డెబిట్, క్రెడిట్, బ్యాంకు ఖాతా నుంచి చెల్లించవచ్చు. ఇక ఫోన్పే, గూగుల్ పే వంటివి వినియోగదారులకు అందుబాటులో ఉండనే ఉన్నాయి.