Monday, May 6, 2024

మన ఊరు మన బడి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

- Advertisement -
- Advertisement -
  • ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ జిల్లా: ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరుమన బడి కార్యక్రమంలో ప్రభుత్వ బడులను ప్రైవేటుకు దీటుగా తీర్చిదిద్ది విద్యార్ధులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్తా, జిల్లా విద్యా శాఖ అధికారి విజయకుమారితో కలిసి మన ఊరుమన బడి కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మన ఊరుమన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 176 పాఠశాలల్లో పనులు చేపట్టగా 30 పాఠశాలల్లో అన్ని వసతులు సమకూర్చి ప్రారంభోత్సవాలు చేసినట్లు తెలిపారు. మరో 20 బడులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అన్నారు. మిగతా పాఠశాలల్లో ఆయా దశల్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

మన ఊరుమన బడి కార్యక్రమానికి ఎలాంటి నిధుల కొరత లేదని సకాలంలో పనులు పూర్తిచేసి వినియోగంలోకి తేవాలని సూచించారు. ప్రతి పాఠశాలల్లో తరగతి గదులతోపాటు వంటశాలలు, మరుగుదొడ్లు నిర్మించాలని, పెయింటింగ్ పనులు చేపట్టి విద్యుత్, నీటి వసతులు కల్పించాలని, టేబుల్స్, ఫ్యాన్లు, బ్లాక్ బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ముందస్తు కార్యాచరణ మేరకు పనులు జరిగేలా చూడాలన్నారు.

అనంతరం డివిజన్ వారిగా పాఠశాలలకు సంబంధించిన పనుల వివరాలను కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాల్లో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తిచేసి జిల్లా మొదటి స్థానంలో నిలిచేలా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ అమోయ్‌కుమార్ ఆకాంక్షించారు. సమావేశంలో రోడ్లు భవనాలు, పంచాయతీ రాజ్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News