Saturday, April 27, 2024

పల్లెకు పట్టం కట్టిన బడ్జెట్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌లో పంచాయతీ రాజ్ శాఖకు రూ. 31,426 కోట్లు కేటాయించడం పట్ల ముఖ్యమంత్రి కెసిఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధన్యవాదాలు తెలిపారు. ఈ బడ్జెట్ పల్లెకు పట్టం కట్టిందని, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతోందని మంత్రి అభివర్ణించారు. సోమవారం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావుకు కృతజ్ణతలు, రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తూ.. ఏటేటా బడ్జెట్ నిధులు పెంచుకుంటూ.. ప్రజల సమగ్ర సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఈ ఏడాది 2,90,396 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆసరా పింఛన్లకు రూ.12 వేల కోట్ల, మిషన్ భగీరథకు రూ.600 కోట్ల రూపాయలు కేటాయించడం పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

గ్రామ స్వరాజ్యం లక్ష్యంగా పల్లె ప్రగతి చేపట్టి తెలంగాణ పల్లెలను ప్రగతి కేంద్రాలుగా, స్వయం సమృద్దంగా కెసిఆర్ తయారు చేశారన్నారు. తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అనేక పురస్కారాలు పొంది తెలంగాణ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేశాయన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో 13 జాతీయ అవార్డులు సాధించామని మంత్రి తెలిపారు. ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీ ఇచ్చి.. పారిశుద్దానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చామన్నారు. హరితహారంలో భాగంగా రూ.710 కోట్ల ఖర్చు చేసి నర్సరీలు ఏర్పాటు చేశామన్నారు. 238 కోట్ల రూపాయలతో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేశామని, 279 కోట్ల రూపాయలతో ప్రతి గ్రామానికి డంపింగ్ యార్డులు నిర్మించి చెత్తనుంచి డబ్బులు సంపాదిస్తున్నామన్నారు.

1330 కోట్ల రూపాయలతో వైకుంఠ ధామాలు నిర్మించి అంతిమ సంస్కారాలు గౌరవంగా జరుపుకునే అవకాశం కల్పించామని తెలిపారు. పది వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసి 5 విడతల పల్లె ప్రగతిని విజయవంతంగా, రాష్ట్రం గర్వించేలా నిర్వహించాం అన్నారు. 4209 కోట్ల రూపాయలతో 8160 కిలో మీటర్ల పంచాయతీరాజ్ రోడ్లను చేపట్టి రవాణా వ్యవస్థను గొప్పగా అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు.దెబ్బతిన్న పంచాయతీరాజ్ పాత రోడ్ల మరమ్మతులు, నిర్వహణ కోసం బడ్జెట్లో 2 వేల కోట్లు ప్రతిపాదించడం పట్ల మంత్రి ధన్యవాదాలు తెలిపారు. తన శాఖలకు బడ్జెట్లో 44,026 కోట్ల రూపాయలను ప్రతిపాదించి, అగ్రస్థానం ఇవ్వడం పట్ల సిఎం, ఆర్థిక శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News