హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం సూచించిన విధంగా జాగ్రత్తలు పాటించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. (ఆస్క్ టిఎస్ గవర్నర్) ట్విట్టర్ వేదికగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానలిచ్చారు. కరోనా పరీక్షలు ఐసిఎంఆర్ మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్నాయని, తెలంగాణలో పరీక్షా సదుపాయాలను పెంచడానికి ఆ దిశగా పనిచేస్తున్నామని పలువురు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా గవర్నర్ సమాధానమిచ్చారు.
కొన్ని గ్రామాలు, పట్టణాల్లో దుకాణదారులు నిత్యావసర ధరలను పెంచి అమ్ముతున్నారని ఓ వ్యక్తి ట్వీట్ చేయగా, ఇలాంటి క్లిష్ట సమయాల్లో ఎవరూ బాధపడవద్దని, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటామని ధరలను పెంచకుండా చర్యలు తీసుకుంటామని గవర్నర్ హామినిచ్చారు. మన ప్రభుత్వాలు లక్ష్యం కోసం పనిచేస్తున్నాయని, ప్రజలందరూ సురక్షితంగా ఉండాలని, అందరూ ఇంట్లో ఉండాలని గవర్నర్ నెటిజన్లకు సూచించారు. సామాజిక దూరాన్ని కాపాడుకోవడం, ముసుగు ధరించడం, తరచుగా చేతులు కడుక్కోవడంతో పాటు ముఖ్యంగా ఇంట్లో ఉండడం వంటి అన్ని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు అడిగిన ప్రశ్నలకు గవర్నర్ సమాధానమిచ్చారు.
రెడ్క్రాస్ వలంటీర్లు వచ్చి సాయం చేస్తారు
రామాపురం ప్రజలకు హ్యాండ్శాంటైజర్, మాస్కులు, మందులను అందించాలని ఓ వ్యక్తి గవర్నర్ను అభ్యర్థించగా, సమీపంలోని రెడ్క్రాస్ వలంటీర్లు వచ్చి సాయం చేస్తారని తమిళిసై పేర్కొన్నారు. ఒక మహిళగా, వైద్యురాలిగా, గవర్నర్గా కరోనా వైరస్ను ఎలా ఎదుర్కొవాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు గవర్నర్ సమాధానమిస్తూ పండ్లు, కూరగాయలు తినాలి, పుష్కలంగా నీరు త్రాగాలి బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఉప్పు, నూనె, చక్కెర, కొవ్వును పరిమితం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. తినే ఆహారంలో పసుపు, వెల్లుల్లి, అల్లం మొదలైన వాటిని ఎక్కువగా వాడాలని సమాధానమిచ్చారు.
ప్రజల కోసం అవసరమయ్యే మరిన్ని చర్యలు చేపట్టాలి
మా అమ్మ మీనాక్షి ముఖ్రా కె సర్పంచ్గా కరోనా వైరస్పై పోరాటం చేస్తుందని ఓ వ్యక్తి గవర్నర్కు ట్వీట్ చేయగా, కరోనా వైరస్పై మారుమూల గ్రామాల్లో సైతం అవగాహన పెరిగినందుకు సంతోషంగా ఉందన్నారు. నిస్వార్థ సేవ కోసం సర్పంచ్గా మీ తల్లి చేస్తున్న కృషిని తాను అభినందిస్తున్నానని గవర్నర్ రీట్వీట్ చేశారు. పోగాతో పాటు ధూమపానం ప్రమాదకరమని ప్రస్తుత సమయంలో వాటిని నిషేధిస్తే బాగుంటుందని ఓ వ్యక్తి గవర్నర్కు సూచించగా, వీటికి సంబంధించిన చట్టాలు ఇప్పటికే అమలులో ఉన్నాయని, ఈ హానికరమైన అలవాట్లను నివారించడానికి ప్రభుత్వం మాత్రమే ముందుకొస్తే సరిపోదని ప్రతి ఒక్కరూ దీనిని వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని గవర్నర్ సూచించారు. మీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారని, ప్రజల కోసం అవసరమయ్యే మరిన్ని చర్యలు చేపట్టాలని గవర్నర్ను అభినందిస్తూ పలువురు ట్వీట్ చేయగా వారికి తమిళిసై ధన్యవాదాలు తెలిపారు.