మనతెలంగాణ/హైదరాబాద్ : సికింద్రాబాద్లోని పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నాడు ఓ మహిళను తీవ్రంగా కొట్టి, నడిరోడ్డుపైనే వివస్త్రను చేసిన దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కొందరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టి ఆమెను రోడ్డుపైనే వదిలేశారు. దీంతో ఆ మహిళ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్కు చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
గృహహింసపై షీటీమ్స్
కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్ సమయంలో నమోదవుతున్న గృహహింస కేసులపై షీటీమ్స్ ప్రత్యేక నిఘా సారిస్తున్నారు. ఈక్రమంలో సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో గృహహింస కేసులు పెరుగుతున్నట్లు పోలీసు రికార్టులు తెలియజేస్తున్నాయి, లాక్డౌన్ కారణంగా మగవారు ఇళ్లకు పరిమితం కావడం, ఖాళీగా కూర్చోవడంతో భార్యభర్తల మధ్య పొరపొచ్చాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్ 16 వరకు డయల్ 100కు ఏకంగా 522 ఫిర్యాదులు అందాయి. ఈ కాల్స్లో 455 ఫిర్యాదులను టెలీ కౌన్సెలింగ్ నిర్వహించి సమస్యను పరిష్కరించారు. మరో 13 కేసులను షీ టీమ్ పరిధిలోని బృందం పర్యవేక్షిస్తోంది. మరో 9 ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.