Monday, April 29, 2024

అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే వ్యక్తిగా కనిపిస్తా

- Advertisement -
- Advertisement -

ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ’పిండం’. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అవసరాల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ “ఈ సినిమా కథ చెప్పేముందు నాకు దర్శకుడు తీసిన స్మోక్ అనే షార్ట్ ఫిల్మ్ చూపించారు. ఆ షార్ట్ ఫిల్మ్ నాకు ఎంతగానో నచ్చింది.

ముఖ్యంగా క్లైమాక్స్ ట్విస్ట్ మెప్పించింది. రచయితగా, దర్శకుడిగా ఆయనలో మంచి ప్రతిభ ఉందని అర్థమైంది. ఆ తర్వాత ఈ సినిమా కథ కూడా నచ్చడంతో ఈ చిత్రం ఖచ్చితంగా బాగా చేయగలరనే నమ్మకంతో పిండం మూవీ చేయడానికి అంగీకరించాను. ఈ సినిమా కథ… పిండం అనే టైటిల్ కి ముడిపడి ఉంటుంది. ఈ కథకి సరిగ్గా సరిపోతుందని దర్శకుడు ఆ టైటిల్ ను ఎంచుకున్నారు. ఈ సినిమాలో లోక్ నాథ్ అనే అతీంద్రియ శక్తుల మీద పరిశోధనలు చేసే వ్యక్తిగా కనిపిస్తాను. అందులో నిష్ణాతులైన ఈశ్వరీ రావు దగ్గరకు నేను నేర్చుకోవడానికి వెళ్తాను. ఆ విధంగా నడుస్తుంది నా పాత్ర. నేను మామూలుగా హారర్ సినిమాలను పెద్దగా ఇష్టపడను. అయితే అనుకోకుండా ’ప్రేమ కథా చిత్రమ్’ థియేటర్ లో చూస్తున్నప్పుడు ప్రేక్షకుల స్పందన చూసి ఆశ్చర్యపోయాను.

కొంచెం భయపెడితే జనాలు శ్రద్ధగా సినిమా చూస్తారని అర్థమైంది. అయితే కేవలం భయపెట్టడమే కాకుండా, ప్రేక్షకులకు ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే పాయింట్ కూడా ఉండాలనేది నా అభిప్రాయం. అలాంటి సినిమానే ఈ పిండం. దర్శకుడు సాయి కిరణ్, నిర్మాత యశ్వంత్ సినిమా మీద ఇష్టంతో యూఎస్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, మందు ముందు వారు మరిన్ని మంచి సినిమాలు తీసే అవకాశం ఇస్తుందని నమ్ముతున్నాను. ఇక నేను త్వరలో విడుదల కానున్న ఈగల్ సినిమాలో నటించాను. కిస్మత్ అనే సినిమాలో నటిస్తున్నాను. అలాగే కన్యాశుల్కం మూవీ చేస్తున్నాను. దాంతో పాటు దర్శకుడిగా తదుపరి సినిమా కోసం ఒక మర్డర్ మిస్టరీ కథను సిద్ధం చేస్తున్నాను. కుమారి శ్రీమతి సీక్వెల్ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి”అని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News