Friday, May 3, 2024

పేదల రేషన్ అడ్డుకునే పాపాత్ములు:మోడీ

- Advertisement -
- Advertisement -

దామోహ్ : కాంగ్రెస్ పార్టీ దేశంలోని పేద ప్రజల రేషన్‌ను అడ్డుకుంటుందా? చివరికి ఈ పార్టీ నేతలు ఈ పాపం కూడా మూటగట్టుకుంటారా? అని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగే మధ్యప్రదేశ్‌లోని దామోహ్ టౌన్‌లో ఆయన బుధవారం ఎన్నికల సభలో ప్రసంగించారు. నిరుపేదలకు ఇప్పుడున్న రేషన్ సరుకుల పథకాన్ని మరో ఐదు సంవత్సరాలు పొడిగిస్తామని ఇటీవల ప్రధాని మోడీ ప్రకటించారు. ఎన్నికల ప్రచార సమయంలో కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతూ ప్రధాని ఈ వాగ్దానానికి దిగడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ భగ్గుమంది. ఈ విషయంపై తమ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తుందని తెలిపింది. ఈ విషయాన్ని ప్రదాన మంత్రి మోడీ ఈ ఎన్నికల సభలో ప్రధానంగా ప్రస్తావించారు. పేదలకు రేషన్ ఇస్తామనితాము అంటున్నామని, దీనిని అడ్డుకుంటామని కాంగ్రెస్ చెపుతోందని, ఈ పాపం కూడా వారు చేయనివ్వండి, ఇటువంటి వాటికి భయపడేది లేదని, ప్రజలకు మంచి చేసేందుకు తాము పాటుపడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్‌లో ఈ నెల 17వ తేదీన పోలింగ్ జరుగుతుంది. తనను ఎవరు ఎన్ని విధాలుగా తిట్టినా తానులెక్కచేసేది లేదని, అవినీతిపరుల పనిపడుతామని మోడీ ప్రకటించారు. ప్రజలు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, మరి అక్కడ ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసివచ్చిందన్నారు. అక్కడి కాంగ్రెస్ సిఎంలు పూర్తిగా దిగజారి చివరికి సత్తా కోసం సట్టాలకు అంటే బెట్టింగ్‌లకు దిగుతూ, ఇటువంటి యాప్స్ వారికి సహకరిస్తూ వారి నుంచి పెద్ద ఎత్తున నల్లధనం నొక్కేస్తున్నారని మోడీ మండిపడ్డారు. ఈ విధంగా అందిన సొమ్మును ఎన్నికలలో అక్రమరీతిలో గెలిచేందుకు వాడుతున్నారని, ఇదో అవినీతి విషవలయం అయిందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశం ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా మారేందుకు ముందుకు దూసుకుపోతోందన్నారు. దేశాన్ని 200 ఏండ్లు పాలించిన బ్రిటన్‌ను వెనకకు నెట్టి ఇప్పుడు భారతదేశం క్రమేపీ ఐదో ఆర్థిక శక్తిగా మారిందని వివరించారు.

ఇప్పుడు ప్రధానిగా తమ మూడో పదవీకాల హయాంలో దేశాన్ని మూడు శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థల దేశాల జాబితాల్లోకి తీసుకువెళ్లుతామని ప్రకటించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రాలలో 85 శాతం కమిషన్ల దందాల పద్థతి వస్తుందని, ఈ విషయం తాను చెప్పడం లేదని, ఆ పార్టీకి చెందిన ప్రధాన మంత్రి ఓ దశలో తెలియచేశారని తెలిపారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ సందర్భంలో మాట్లాడుతూ కేంద్రం విడుదల చేసే ప్రతి రూపాయిలో నిర్ధేశిత లబ్థిదారులకు అందేది కేవలం 15 పైసలే అవుతోందన్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు కమిషన్ల పాలనకు చాలా లింక్ ఉందని చమత్కరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సొమ్మును లూఠీ చేసిందని, అందుకే వారి హయాంలో దేశం ముందుకు వెళ్లలేదని విమర్శించారు.

ఏ కోర్టుకు వెళ్లినా 80 కోట్ల మంది పేదలకు రేషన్ ఆగదు
దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది పేదలకు ఇప్పుడున్న రేషన్ పథకం ఇక ముందు కూడా కొనసాగుతుందని , దీనిని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని గుణ సభలో ప్రధాని స్పష్టం చేశారు. పేదలకు ఉచిత రేషన్ సరఫరా వచ్చే డిసెంబర్‌తో ముగియదు. ఇక ముందు కూడా ఉంటుంది. ఈ మేరకు తాను ఏదైనా చేస్తానని ప్రధాని ప్రకటించారు. వచ్చే ఐదేళ్లు ఈ పథకం ఉంటుంది. కాంగ్రెస్ వారు ఈ ప్రపంచంలోని ఏ కోర్టుకు వెళ్లినా, ఎవరికి ఫిర్యాదు చేసినా, తలకిందులుగా విన్యాసాలకు దిగినా పేదలకు ఉచిత రేషన్ కొనసాగితీరుతుందన్నారు.

మహిళా మర్యాద తెలియని ప్రతిపక్ష ఇండియా నేతలు
ఇప్పుడు అయోమయంగా అవతరించి కుంటుతోన్న ప్రతిపక్ష కూటమి ఇండియా నేతలకు దేశంలోని మహిళల పట్ల చులకన భావం ఉందని ప్రధాని మోడీ విమర్శించారు. బీహార్ సిఎం , ఇండియా కూటమి నేత నితీశ్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోడీ మధ్యప్రదేశ్‌లోని గుణలో విరుచుకుపడ్డారు. ఓ నేత ఏకంగా రాష్ట్ర అసెంబ్లీలోనే మహిళల పట్ల దిగజారుడు వ్యాఖ్యలకు దిగారని , అయితే ఇంతవరకూ ప్రతిపక్ష కూటమి వారి నుంచి దీనిపై ఎటువంటి ఖండనలు వెలువడలేదని , ఇది ఇండియా కూటమిలోని నేతలకు మహిళల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని తెలిపారు. నిండుసభలో ఆడపడుచులు, సోదరీల పట్ల ఇష్టం వచ్చిన భాషను వాడారు. చివరికి ఎవరూ తమ మనస్సుల్లోకి కూడా ఇటువంటి మాటలు రావు. వీటిని బహిరంగంగా వెల్లడించి మహిళలను అమానించిన ఈ వ్యక్తికి సిగ్గన్పించడం లేదా? అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించకుండా ఉన్న ఇతర ప్రతిపక్ష నేతలకు కూడా మహిళల పట్ల ఎంతటి గౌరవం ఉందనేది తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News