Monday, May 6, 2024

మాస్కుతో మస్కా…

- Advertisement -
- Advertisement -

ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు తిప్పలు
బైక్‌లకు మాస్కులు పెడుతున్న వాహనదారులు
సిసి కెమెరాలతో పట్టుకుంటున్న ట్రాఫిక్ పోలీసులు

మనతెలంగాణ, సిటిబ్యూరో: కరోనా కోసం వాడాల్సిన మాస్కులను కొందరు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు వాడుతున్నారు. మాస్కులను బైక్‌ల నంబర్‌ప్లేట్లకు పెట్టి ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. వీటిని కనిపెట్టిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని భారీగా జరిమానా విధిస్తున్నారు. సాధారణంగా రూ.280 జరిమానాతో పోవాల్సిన చలాన్లు వేల రూపాయలు సమర్పించుకుంటున్నారు. కొందరు ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు బైక్ వెనుక కూర్చున్న వారు కాలును నంబర్ ప్లేట్‌కు అడ్డు పెడుతున్నారు. ఇలా కాలును అడ్డు పెడుతున్న వారిని కనిపెడుతున్న పోలీసులు వారి ఫొటోలు తీసి భారీగా జరిమానా విధిస్తున్నారు. ఇలా కాలు అడ్డుపెట్టి ట్రాఫిక్ చలాన్ తప్పించుకునేందుకు యత్నించిన ఓ వాహనదారుడికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనం సమాచారం దాచేందుకు యత్నించినందుకు రూ.500, హెల్మెట్ లేకపోవడంతో రూ.200, పిలియన్ రైడ్ రూ.100, సెల్ ఫోన్ డ్రైవింగ్‌కు రూ.1,000, ఇర్రెగులర్ నంబర్ ప్లేట్ రూ.200 మొత్తం కలిసి రూ.4,000 జరిమానా విధించారు. ఇలా చాలామందికి భారీ ఎత్తున జరిమానాలు విధిస్తున్నారు. ఇలా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. చిన్న జరిమానాతో పోవాల్సిన దానిని వాహనదారులే కావాలని తప్పు చేయడంతో భారీగా జరిమానా విధిస్తున్నారు. వాహనం సమాచారం దాచేందుకు యత్నిస్తుండడంతో ఇది క్రిమినల్ కేసుల కింద వస్తుంది. సాధారణంగా ఇలాంటివి నేరాలు చేసేవారు తాము నేరం చేస్తున్న సమయంలో వాహనం వివరాలు పోలీసులకు తెలియకుండా ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ వీటిని వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు వాడుకుంటున్నారు. ఇలాంటి వారిని ఎక్కువగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మాత్రమే పట్టుకుని భారీగా జరిమానా విధిస్తున్నారు.

కరోనాతో కొత్త ఆలోచన…

ఇది వరకు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు తప్పించుకునేందుకు నంబర్ ప్లేట్‌లో ఒక నంబర్‌ను తప్పించేవారు. తర్వాత క్లాత్ లాంటిది చుట్టేవారు. కరోనా నుంచి మాస్కులు పెడుతుండడంతో వాటిని వాహనాల నంబర్ ప్లేట్లకు తొడిగి తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. అయితే వాహనదారులకు తెలియని విషయం ఎంటంటే ఎంత దాచినా ట్రాఫిక్ పోలీసుల వద్ద ఉన్న టెక్నాలజీ సాయంతో వాహనం నంబర్‌ను తెలుసుకుని ఇంటికి జరిమానా పంపిస్తున్నారు. కరోనా రాకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవాలని వైద్యులు సూచిస్తే వాహనదారులు దానిని వాడుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News