Tuesday, May 14, 2024

పరకాల మున్సిపాలిటీ ఓట్లే కీలకం

- Advertisement -
- Advertisement -

(బలేరావు బాబ్జీ/ వరంగల్ ప్రతినిధి)
ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది పరకాల మున్సిపాలిటీ, అభ్యర్థుల తలరాతను మార్చే నిర్ణయాత్మక శక్తిగా పరకాల పట్టణ ఓటర్లు ఉన్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నికలైనా పరకాల పట్టణ ఓట్ల మెజార్టీయే రాజకీయ పార్టీలకు కలిసోస్తుంది. ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలలో ఇక్కడి ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీ విజయాన్ని అందుకుంటున్నట్లు ఫలితాల విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. వరుసగా రెండు పర్యాయాలు ఎంఎల్‌ఏగా గెలుపొంది ప్రస్తుతం మూడవ పర్యాయం బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో ఉన్న సిట్టింగ్ ఎంఎల్‌ఏ చల్లా ధర్మారెడ్డికి గతంలో పరకాల పట్టణ ఓటర్లు అండగా నిలిచారు. ధర్మారెడ్డి కన్నా ముందు ఎంఎల్‌ఏలుగా గెలుపొందిన కొండా సురేఖ, బండారు శారారాణి, బొజ్జపెల్లి రాజయ్య, పోతరాజు సారయ్య, ఒంటేరు జయపాల్, బొచ్చు సమ్మయ్యలకు కూడా పట్టణ ఓట్ల మెజార్టీయే కలిసొచ్చింది

గెలుపోటములు ప్రభావితం చేయనున్న 26వేల ఓట్లు
నియోజకవర్గంలో మొత్తం 2,21,436 ఓట్లకు గాను పరకాల మండలంలో 41,026 మంది ఓటర్లు, ఆత్మకూరు మండలంలో 27,921 మంది ఓటర్లు, దామెర మండలంలో 21,705 మంది, గీసుకొండ మండలంలో 50,785 మంది, ఖిలా వరంగల్ మండలంలో 11,015 మంది, నడికుడ మండలంలో 28,760 మంది, సంగెం మండలంలో 40,224 మంది ఓటర్లు ఉన్నారు. అయితే పరకాల మండలంలోని 41,026 ఓట్లలో 26,090 ఓట్లు పరకాల పట్టణంలోనివే కావడం విశేషం. పట్టణంలోని 26 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 26వేల 90వేల ఓట్లకు గాను 12,641 మంది పురుష ఓటర్లు, 13,476 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మండలంలో మొత్తం 41 వేల ఓట్లలో పరకాల రూరల్ గ్రామాల్లోని 14,936 ఓట్లకు అభ్యర్థులు ఎంతగా శ్రమించినా పరకాల పట్టణానికి వచ్చే సరికి 26వేల 90వేల ఓట్లే కీలకమవుతున్నాయి.

మున్సిపల్ పరిధిలోని పట్టణ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే అటే గెలుపు ఖాయమవుతుండడంతో రాజకీయ పార్టీలు ప్రధానంగా ఇక్కడే ఫోకస్ పెడుతున్నాయి. గెలుపోటములపై ప్రభావం చూపనున్న పట్టణ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు నానా తిప్పలు పడుతున్నారు. గతంలో వలే మెజార్టీ ఓట్లు ఈసారి కూడా తనకేనని, బిఆర్‌ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి ధీమా వ్యక్తం చేస్తుండగా, కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు రేవూరి ప్రకాష్‌రెడ్డి, కాళీ ప్రసాదరావులు ప్రజలు మార్పు కోరుకుంటున్నందు వలన ఈ సారి తమకే మెజార్టీ ఓట్లు పడతాయని విశ్లేషించుకుంటున్నారు. అభ్యర్థుల తలరాతను మార్చే పరకాల ఓటర్ల మదిలో ఏముందో ఈసారి ఎవరికి మొగ్గు చూపుతారో వేచి చూడాల్సిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News