Tuesday, April 30, 2024

మావోయిస్టుల కోటలో తొలిసారి పోలింగ్

- Advertisement -
- Advertisement -

రాంచీ : మావోయిస్టుల కంచుకోటగా పేరున్న ఝార్ఖండ్ సింహ్‌భూమ్ పార్లమెంట్ నియోజక వర్గం లోని మారుమూల ప్రాంతాల్లో 118 పోలింగ్ బూత్‌లను ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేస్తోంది. ఇక్కడికి పోలింగ్ బృందాలను , సామగ్రిని హెలికాప్టర్‌లలో తరలించనున్నారు. ఇక్కడ మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఆసియా లోని అత్యంత చిక్కటి సాల్ అడవి కేంద్రమైన సరండేలో ఈ సారి పోలింగ్ నిర్వహించడం ఈసీకి సవాలే. పశ్చిమ సింహ్‌భూమ్ ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది.

ఇక్కడ గతేడాది మొత్తం 46 తీవ్రవాద సంఘటనలు చోటు చేసుకోగా, 22 మంది మరణించారు. గతంలో మావోలు ఇక్కడి తాల్కోబాద్ ప్రాంతం లోని 22 గ్రామాలను విముక్త ప్రదేశాలుగా ప్రకటించారు. కానీ భద్రతా దళాలు నిరంతరం ఆపరేషన్లు నిర్వహించి పట్టు సాధించాయి. ఈ ప్రాంతంలో మొత్తం 15 క్యాంపులను ఏర్పాటు చేశాయి.ప్రజలకు ఓటు హక్కువ కల్పించేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. “118 బూత్‌లున్న రోబోకేరా, బింజ్ , తాల్కోబాద్, జరాయికేలా, హంస బేడా, రెంగ్రాథూ, ఛోటా నగర్ వంటి చోట్ల సామగ్రిని ఎయిర్‌డ్రాప్ చేస్తాం.

కొన్ని పోలింగ్ పార్టీలు రోడ్డు మార్గంలో వెళ్లనున్నాయి. ఇక 121 బృందాలను రైళ్లలో తరలించనున్నాం. డ్రైరన్స్ పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో 100 ఏళ్లు దాటిన 62 మంది ఓటర్లు ఉండటం విశేషం. ఇక్కడి వృద్ధులు, వికలాంగులు ఇళ్ల వద్దే ఓటు హక్కు వినియోగించుకొనేలా ఏర్పాట్లు చేశాం. ప్రజలకు అవగాహన కల్పించేందుకు 1,284 చునావ్ పాఠశాలలను నిర్వహించాం” అని జిల్లా కలెక్టర్ కుల్దీప్ వెల్లడించారు. సింహ్‌భూమ్ ఎస్టీ నియోజకవర్గం నుంచి మాజీ సిఎం మధుకోడా సతీమణి గీతా గతంలో గెలిచారు. ఈసారి బీజేపీ టికెట్‌పై ఆమె బరిలోకి దిగనున్నారు. ఇండియా కూటమి ఇంకా అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News