కరోనా పరీక్షలక్కర్లేదు: వైట్హౌస్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బాగా ఆరోగ్యంగా ఉన్నారని, ఆయనకు కరోనా పరీక్షలు జరపలేదని వైట్హౌస్ తెలిపింది. అయితే అమెరికా చట్టసభ ప్రతినిధులు కొందరు తాము ఇతరుల వద్దకు వెడుతున్నందున ఈ వైరస్ వస్తుందేమో అని భావించి తమకు తాముగా విడిగా ఉంటున్నారు. కానీ వారితో కూడా ట్రంప్ టచ్లో ఉన్నారు. వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ స్టెఫానీ గ్రిషాం సోమవారం మాట్లాడుతూ ‘ఆయన (ట్రంప్) ఆరోగ్యంగా ఉన్నారు. వ్యాధి లక్షణాలు కనిపించలేదు. కాబట్టి పరీక్షలు అవసరం లేదు. పైగా చట్ట సభ ప్రతినిధులకు వైరస్ సోకినట్టు నిర్ధారణ కాలేదు. అంతేకాక, కోవిడ్ 19 సోకినట్టు ధ్రువీకరణ జరిగిన ఎవరితోనూ ఆయన సన్నిహితంగా లేరు. అధ్యక్షుడి వైద్యుడు నిరంతరం ఆయనను సన్నిహితంగా పరిశీలిస్తున్నారు’ అని వివరించారు. కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సిపిఎసి)కి హాజరైన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయనను కలుసుకున్న తర్వాత చట్టప్రతినిధులు తమకు తాముగా విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వైట్హౌస్ ప్రకటన వెలువడింది. అంతకు ముందు ఒక మీడియా సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ‘కరోనాను అదుపు చేసేందుకు మా ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. అమెరికా ప్రజలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ పట్ల చాలా అప్రమత్తంగా ఉన్నాం. జాగ్రత్త తీసుకుంటున్నాం’ అని హామీ ఇచ్చారు. కరోనాపై చర్యలకు సారథ్యం వహిస్తున్న అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ మాట్లాడుతూ ‘అమెరికన్లకు కరోనా వచ్చే అవకాశం చాలా తక్కువ’ అన్నారు.
President Trump has good Health: White House