Saturday, May 11, 2024

పారిశ్రామిక రంగం అభివృద్ధితోనే పురోగతి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : జిల్లాలో వ్యవసాయ రంగానికి ఎదురు లేకుండా ఉన్నప్పటికి అనుబంధంగా పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందితేనే పురోగతి ఉంటుందని జిల్లా కలెక్టర్ కె. శశాంక స్పష్టం చేశారు. మంగళవారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాల్‌లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. జడ్‌పి చైర్‌పర్సన్ ఆంగోతు బిందు, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.

ముందుగా సభను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని దాటి పారిశ్రామికీకరణ జరిగినప్పుడే పురోగతిలో ఉంటామన్నారు. జిల్లాలో 185 క్వారీలు లీజుకు నడుస్తున్నాయని 915 మైక్రో యూనిట్స్ ఉన్నాయని ఒక వెయ్యి యూనిట్స్ ఇతరత్రా నడుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. కష్టపడితే ఉన్నతంగా రాణించగలుగుతామని కష్టపడే తత్వాన్ని ఇష్టంతో పెంపొందించుకోవాలని తెలిపారు. మరిపెడ మెయిన్ రోడ్‌లో నెలకొల్పిన వస్త్ర దుకాణం రాణిస్తుందన్నదంటే అందుకు కారణం కష్టపడే తత్వం ప్రధానంగా ఉందన్నారు.

ఎదుగుల వేగవంతంగా ఉండాలంటే సేవారంగం ముందు నిలబడుతుందని అనంతరం పరిశ్రమ రంగమేనని తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత సాగునీటి రంగానికి ప్రాధాన్యత పెరిగిందని తద్వారా పంటల విస్తీర్ణం పెరిగిందని దిగుబడి సాధిస్తున్నరని కొనుగోలు చేసిన పంటను నిలువ చేసుకునే సామర్ధాన్ని ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు కారణం విద్యుత్ రంగమేనని నాణ్యమైన విద్యుత్‌ను అందించడమేనని 24 గంటలు నిరంతరం సరఫరా కారణమని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి దూర దృష్టితో తొమ్మిది వసంతాలు పాటు నిరంతరంగా శ్రమిస్తూ బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాలలో అభివృద్ధిని వేగవంతం చేశారని అందులో మొట్టమొదటిది విద్యుత్ రంగం అన్నారు.

యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జడ్‌పి చైర్‌పర్సన్ ఆంగోతు బిందు మాట్లాడుతూ ఏ రంగంలోనైనా రాణించాలంటే స్కిల్స్ అవసరమని విద్యను అభ్యసించిన వృత్తులలో నిష్టాణితులు కావాలని కోరుతూ అందుకు ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయవలిసి ఉందన్నారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ యువత ఏమైపోతుందోనన్న బాధగా ఉందని సరైన గాడిలో పెట్టాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందన్నారు. ఎమ్మెల్యే శంకర్‌నాయక్ మాట్లాడుతూ కష్టపడందే ఏదీ మన దరికి రాదని శోధించి సాధించాలన్నారు.

అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలను అతిథులు శాలువాలు కప్పి మెమొంటోలు అందించి సన్మానించారు. పరిశ్రమల శాఖ సంబంధిత రంగాలతో స్టాల్స్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, పరిశ్రమల శాఖ అధికారి సత్యనారాయణ, దశాబ్ది ఉత్సవాల నోడల్ అధికారి సూర్యానారాయణ, జిల్లా పారిశ్రామికవేత్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News