Friday, May 10, 2024

పంజాబ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వీఐపీలకు భద్రత తొలగింపు

- Advertisement -
- Advertisement -

Punjab government removes security for VIPs

 

చండీగఢ్ : మాజీ మంత్రులు, మాజీ ఎమ్‌ఎల్‌ఎలకు భద్రతను రద్దు చేసిన పంజాబ్ ఆమ్ ఆద్మీ ప్రభుత్వం తాజాగా పలువురు రాజకీయ ప్రముఖులు, మత పెద్దలకు కూడా భద్రతను తొలగించింది.  రిటైర్డ్ పోలీసు, అధికారులు, మత పెద్దలు, రాజకీయ నేతలు ఇలా 424 మందికి కేటాయించిన పోలీస్ భద్రతను ఉపసంహరించుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రకటించింది. డేరా రాధ సోమీ బ్యాస్‌కు ఉన్న 10 మంది భద్రతను కూడా తొలగించినట్టు తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 184 మంది మాజీ మంత్రులు, ఎమ్‌ఎల్‌ఎలకు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకుంది. వీరిలో మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీతోపాటు మాజీ మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, రాజ్ కుమార్ వెర్కా, భరత్ భూషణ్ ఆసు వంటి ప్రముఖులు ఉన్నారు. ఈ నిర్ణయంతో 400 మందికి పైగా పోలీస్ సిబ్బంది తిరిగి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్టు సీఎం భగవంత్ మాన్ తెలిపారు పోలీసులు సామాన్య ప్రజల కోసం పనిచేయాలి కానీ, వీఐపీలకు భద్రతావిధుల పేరుతో వారిని బాధపెట్టకూడదని తమ ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టు మాన్ వెల్లడించారు.

అంతకు ముందు మాజీ ఎమ్‌ఎల్‌ఎల పింఛను విషయం లోనూ మాన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శాసససభ్యులుగా ఎన్నిసార్లు ఎన్నికైనా ఇకపై ఒకే ఒక్క పదవీకాలానికి ప్రభుత్వం పింఛను అందజేస్తుందని ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఒకసారి శాసనసభ్యునిగా ఎన్నికైన వారికి పదవీకాలం ముగిశాక నెలకు రూ. 75 వేల చొప్పున పింఛను చెల్లిస్తున్నారు. తరువాత ప్రతి పదవీకాలానికి ఈ పింఛను మొత్తంలో 66 శాతాన్ని అదనపు పింఛనుగా ఇస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం మూడున్నర లక్షల నుంచి అయిదున్నర లక్షల రూపాయల వరకు పింఛను తీసుకునే మాజీ ఎంఎల్‌ఎలు ఉన్నారని, ఈ నిర్ణయం వల్ల కోట్లాది రూపాయలు ప్రజా ప్రయోజనాలకు ఖర్చు పెట్టే అవకాశం లభిస్తుందని సీఎం మాన్ అన్నారు. అయితే దీనిపై రాష్ట్రశాసన సభలో బిల్లు తీసుకురావాలని పంజాబ్ గవర్నర్ ప్రభుత్వానికి సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News