Monday, May 6, 2024

టిఎస్ ఆర్టీసి బస్సుల్లో రేడియోల ఏర్పాటు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రయాణికులకు మరింతగా చేరువయ్యేందుకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ముందుకు వెళుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల ప్రయాణం వినోదాత్మకంగా, సంతోషంగా కొనసాగేందుకు బస్సుల్లో ‘టిఎస్ ఆర్టీసి రేడియో’ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దానిపై పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన ఆర్టీసి ఫైలట్ ప్రాజెక్టుగా నగరంలోని 9 ఆర్డీనరీ, మెట్రో బస్సుల్లో ఈ రేడియోను అందుబాటులోకి తీసుకువచ్చింది.

హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో కూకట్‌పల్లి డిపో బస్సులో ఈ రేడియోను టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ శనివారం ప్రారంభించారు. అనంతరం రేడియో పనితీరును పరిశీలించారు. రేడియో ఏర్పాటు, అది పనిచేస్తున్న విధానం, సౌండ్, తదితర విషయాల గురించి టిఎస్ ఆర్టీసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పివి మునిశేఖర్, కూకట్‌పల్లి డిపో మేనేజర్ ఇషాక్ బిన్ మహ్మద్, మెకానికల్ సూపరింటెండెంట్ జయరాం, ఎలక్ట్రిషీయన్ కేవీఎస్ రెడ్డిలను ఎండి సజ్జనార్ అడిగి తెలుసుకున్నారు.

ఫైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో
ఫైలట్ ప్రాజెక్టుగా 9 సిటీ బస్సుల్లో ఏర్పాటు చేసిన టిఎస్ ఆర్టీసి రేడియో ప్రయాణికులను అలరిస్తుందని సంస్థ ఎండి విసి సజ్జనార్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఉప్పల్ టు సికింద్రాబాద్, దిల్‌సుఖ్‌నగర్ టు సికింద్రాబాద్, గచ్చిబౌలి టు మెహిదిపట్నం, సికింద్రాబాద్ -టు పటాన్‌చెరువు, కూకట్‌పల్లి -టు శంకర్‌పల్లి, కొండాపూర్ -టు సికింద్రాబాద్, కోఠి -టు పటాన్‌చెరువు, ఇబ్రహీంపట్నం టు జేబీఎస్ మార్గాల్లో ప్రయాణించే బస్సుల్లో ఈ రేడియోను ఏర్పాటు చేశామని ఎండి తెలిపారు. ఆయా బస్సుల్లో శనివారం నుంచే రేడియో సేవలు ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.

ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యత గురించి..
ఈ రేడియోలో మంచి పాటలతో పాటు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతను, టిఎస్ ఆర్టీసి అందిస్తోన్న సేవలను ప్రయాణికులకు వివరిస్తున్నామని ఎండి పేర్కొన్నారు. మానవ సంబంధాల ప్రాముఖ్యత, నైతిక విలువలను పెంపొందించే నీతి కథలను ఈ రేడియోలో అందుబాటులో ఉంచామని ఆయన వివరించారు. అలాగే ఈ రేడియో ద్వారా మహిళ, పిల్లల భద్రత, సైబర్, ఆర్థిక నేరాలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తామని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులకు వినోదం అందించడంతో పాటు సామాజిక అంశాలపై అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన వివరించారు.

క్యూఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్
ప్రయాణికుల అభిప్రాయాలను స్వీకరించిన తర్వాత పూర్తిస్థాయిలో అన్ని బస్సుల్లోనూ రేడియోను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం భావిస్తుందని సజ్జనార్ తెలిపారు. ప్రయాణికుల అభిప్రాయాల స్వీకరణకు 9 బస్సుల్లో క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేశామని సజ్జనార్ వివరించారు. ఆ క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్ ఫోన్‌లో స్కాన్ చేసి రేడియోపై ఫీడ్‌బ్యాక్‌ను ప్రయాణికులు ఇవ్వాలని ఎండి సూచించారు. టిఎస్ ఆర్టీసి తీసుకొచ్చిన ఎన్నో కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించారని, ఈ కొత్త విధానాన్ని కూడా ప్రోత్సహించాలని ఆయన కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News