పంజాబ్ ట్రాక్టర్ ర్యాలీలో రాహుల్గాంధీ
మోగా: కేంద్రంలో తాము అధికారంలోకి రాగానే బిజెపి ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను చెత్త బుట్టలో పడేస్తామని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ రైతులకు హామీ ఇచ్చారు. కొంతమంది ఎంపిక చేసిన కార్పొరేట్ల కోసం బిజెపి ప్రభుత్వం పని చేస్తోందని, రైతులను నాశనం చేసేందుకే ఆ చట్టాలను తెచ్చిందని రాహుల్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్లో ట్రాక్టర్ ర్యాలీని ప్రారంభిస్తూ ప్రధాని మోడీపై రాహుల్ ధ్వజమెత్తారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా పంజాబ్లోని కాంగ్రెస్ ప్రభుత్వం అక్టోబర్ 4నుంచి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ట్రాక్టర్ ర్యాలీలు నిర్వహిస్తోంది. ఆదివారం మోగా జిల్లాలోని బధనీకలాన్లో నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీకి రాహుల్ నేతృత్వం వహించారు. ర్యాలీనుద్దేశిస్తూ రాహుల్ ప్రసంగించారు.
బిజెపి ప్రభుత్వ లక్షం రైతులకు కనీస మద్దతు ధర(ఎంఎస్పి) కల్పించే ఆహార సేకరణ విధానాన్ని రద్దు చేయడమేనని రాహుల్ విమర్శించారు. అదే జరిగితే పంజాబ్, హర్యానా రైతులకు వినాశకర పరిస్థితే అని రాహుల్ అన్నారు. కానీ, తాము అలా జరగనీయమని, రైతుల పక్షాన దృఢంగా పోరాడుతామని, ఒక్క ఇంచు కూడా వెనక్కి తగ్గబోమని రాహుల్ హామీ ఇచ్చారు. మోడీ ప్రభుత్వం అదానీలు, అంబానీల చేతుల్లో తోలుబొమ్మ అని రాహుల్ ఘాటుగా విమర్శించారు.