వేడుకలకు దూరంగా రాహుల్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 51వ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర పార్టీల అగ్రనేతలు శనివారం ఆయనకు శుభాకాంక్షలు తెలియచేశారు. కొవిడ్-19 రెండవ దశను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని రాహుల్ నిర్ణయించుకున్నారు. 1970 జూన్ 19న ఢిల్లీలో రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ దంపతులకు జన్మించిన రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన కేరళలోని వయనాడ్ లోక్సభ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
రాహుల్ జన్మదినాన్ని సేవా దివస్గా పాటించాలని ఢిల్లీ కాంగ్రెస్ నిర్ణయించి దేశ రాజధానిలో ఫేస్ మాస్కులు, మెడికల్ కిట్ల ఉచిత పంపిణీతో పేదలకు అన్నదానం నిర్వహించింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ ఉచిత వ్యాక్సినేషన్ శిబిరాన్ని నిర్వహించగా యువజన కాంగ్రెస్ అధ్వర్యంలో ఢిల్లీలో ఉచిత రేషన్ పంపిణీ జరిగింది. కొన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు కూడా పేదలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులను ఉచితంగా పంపిణీ చేశాయి. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రులు ఎంకె స్టాలిన్(తమిళనాడు), అరవింద్ కేజ్రీవాల్(ఢిల్లీ), హేమంత్ సోరెన్(జార్ఖండ్), కన్రాడ్ సంగ్మా(మేఘాలయ), కెప్టెన్ అమరీందర్ సింగ్(పంజాబ్), అశోక్ గెహ్లాట్(రాజస్థాన్), భూపేష్ బఘేల్(ఛత్తీస్గఢ్), శివ్రాజ్ సింగ్ చౌహాన్(మధ్యప్రదేశ్) తదితరులు రాహుల్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు.