హైదరాబాద్: తూర్పు మధ్య దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో కొనసాగుతున్న వాయుగుండం.. ఉత్తర దిశగా ప్రయాణించి సోమవారం ఉదయం 08.30 గంటలకు Lat.13.2 deg N, Long. 71.4 deg.E వద్ద పాంజిమ్(గోవా)కు నైరుతి దిశగా 360 కి.మీలు, ముంబై(మహారాష్ట్ర)కు దక్షిణ నైరుతి దిశగా 670 కి.మీ, సూరత్(గుజరాత్)కు దక్షిణ నైరుతి దిశగా 900 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది రాగల 12 గంటల్లో మరింత బలపడి తూర్పు మధ్య ఆనుకొని ఉన్న ఆగ్నేయ అరేబియా సముద్రం ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తదుపరి 24 గంటల్లో బలపడి తూర్పు మధ్య అరేబియా సముద్రం ప్రాంతాల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని, ప్రారంభంలో జూన్ 2వ తేదీ ఉదయం వరకు ఉత్తర దిశగా ప్రయాణించి తరువాత ఉత్తర ఈశాన్య దిశగా జూన్ 3వ తేదీ సాయంత్రం లేదా రాత్రి సమయంలో హరిహరేశ్వర్ (రైగర్, మహారాష్ట్ర) దామన్ మధ్య ఉత్తర మహారాష్ట్ర మరియు దక్షిణ గుజరాత్ తీరాలను దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఈరోజు రాత్రి, మంగళవారం, బుధవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో (గంటకు 30 నుంచి 40 kmph) వేగంతో పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీంతో మంగళవారం తెలంగాణలోని వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మేడ్చల్ మల్కాజ్గిరి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నగర్ కర్నూల్, వనపర్తి మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలలో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Rain in next two days in Telangana