న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాన్ని ఊతమిచ్చేందుకే రక్షణ శాఖ ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. 101 రక్షణ వస్తువుల దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు రక్షణ శాఖమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఆయధ సంపత్తి సహా రక్షణ శాఖ ఉత్పత్తులు దేశీయంగానే తయారీ చేయాలని రక్షణ శాఖ నిర్ణయం తీసుకుంది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయంగా రక్షణశాఖ తయారీ రంగాన్ని బలోపేతం చేస్తుందని రాజ్నాథ్ తెలిపారు. 2020-2024 మధ్య రక్షణ వస్తువులు దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు చెప్పారు.
సాయుధ దళాల అవసరాలను గుర్తించి రక్షణ పరిశ్రమకు తెలియజేస్తామన్నారు. దీంతో సాయుధ దళాల అవసరాలను దేశీయంగా తీర్చటానికి వీలుంటుందని సూచించారు. డిఆర్డివొ సాంకేతిక పరిజ్ఞానానికి ఊతం ఇచ్చినట్లు అవుతుందని చెప్పారు. రక్షణ బడ్జెట్ ను దేశీ, విదేశీ రక్షణ ఉత్పత్తుల సేకరణ పద్దుగా విభజించామని చెప్పుకొచ్చారు. నిషేధ ఉత్పత్తుల్లో ఫిరంగి, తుపాకులు, రైఫిళ్లు, రవాణా విమానాలు ఉన్నాయి. దేశంలో నిషేధం విధించిన వస్తువులను దేశీయంగా ఉత్పత్తి చేయడానికి గడువు కూడా విధిస్తామని రక్షణ శాఖమంత్రి ప్రకటించారు.