మిలిటరీ లిటరరీ సభలో రక్షణ మంత్రి
చండీగఢ్ : మనిషి చేతుల్లోని సెల్ఫోన్ ఇప్పుడు మిస్సైల్ కన్నా అత్యంత సమర్థవంతం అయి కూర్చుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశాల మధ్య ప్రచ్ఛన్న పోరుకు ఇప్పుడు వేదికలవుతున్న సోషల్ మీడియాలు , వాటిని చలితం చేస్తున్న సెల్ఫోన్ల గురించి ప్రస్తావించారు. ఇక్కడ జరిగిన వార్షిక సైనిక సాహితీ ఉత్సవంలో రాజ్నాథ్ మాట్లాడారు. రానున్న రోజులలో వివిధ రకాల భద్రతా సవాళ్లు తలెత్తుతాయని, యుద్ధ రీతుల్లో మార్పు వస్తుందని తెలిపారు. ఇప్పటికైతే క్షిపణి కన్నా సెల్ఫోన్ డేంజర్ అన్పిస్తోందని, దీని ప్రభావ పరిధి విస్తృతం అవుతోందని తాను భావిస్తున్నట్లు తెలిపారు.
ఇంతవరకూ కలలో కూడా ఊహించలేని ఘర్షణలు సంతరించుకునే పరిణామాలు ఉన్నాయని, ఇప్పుడు వాటిని మనం అనుభవిస్తున్న దశలో సైనిక సాహితీ వేడుకకు ప్రాధాన్యత ఉందన్నారు. మిస్సైల్కు గురిచూసి కొట్టే స్థాయి దూరం పరిమితులు ఉండవచ్చు అని, అయితే ఈ క్రమంలో చూస్తే సెల్ సమాచార ప్రసారణ సామర్థం పెరిగిపోయిందని అన్నారు. ఇంతకు ముందటిలాగా శత్రువు మనను దెబ్బతీసేందుకు సరిహద్దులు దాటే రావాల్సిన అవసరం లేదని, తన వద్ద ఉన్న సెల్తోనే దేశాల మధ్య విభేదాలు సృష్టించి, ఘర్షణలు పెంచి పోషించవచ్చునని తెలిపారు. ఈ క్రమంలో ప్రతి ఒక్క పౌరుడూ సైనికుడి బాధ్యత తీసుకోవల్సి ఉంటుందన్నారు.