హైదరాబాద్ : రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఇండియా ఉద్యమంలా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి మణికొండలోని తన నివాసంలో ఆదివారం మొక్కలు నాటారు. ఈసందర్భంగా రామజోగయ్యశాస్త్రి మాట్లాడుతూ..సిఎం కెసిఆర్ ప్రారంభించిన హరితహరం స్ఫూర్తితో ఎంపి సంతోష్కుమార్ గ్రీన్ ఛాలెంజ్ ఇండియా చేపట్టడం అభినందనీయమని కొనియాడారు. తనకు మొక్కలన్న, చెట్లన్న చాలా ఇష్టమని ఆయన తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడం చాలా సంతోషానిచ్చిందని అన్నారు. పర్యావరణానికి మొక్కలు ఎంతగానో మేలు చేస్తాయని, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం ఈ గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించాల్సిందిగా సినీ కవి చంద్రబోస్, సంగీత దర్శకులు థమన్, సినీ హీరో రాజ్ తరుణ్ మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఛాలెంజ్ ప్రతినిధి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండేషన్ నిర్వాహకులు సుబ్బరాజు పాల్గొన్నారు.
ఎంపి సంతోష్కుమార్ పిలుపు మేరకు అసెంబ్లీ ఆవరణలో మొక్కలు నాటిన మంత్రి వేముల..
మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపి హరితహారంలో భాగంగా భావితరాల కోసం మొక్కలు నాటాలని సూచించిన రాజ్యసభ సభ్యులు జోగిని పల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ఆదివారం అసెంబ్లీ ఆవరణలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మొక్కలు నాటారు. భవిష్యత్ తరాలకు మనమిచ్చే సంపద పర్యావరణ పరిరక్షణ మాత్రమే అని భావించి సిఎం కెసిఆర్ తెలంగాణకు హరితహారం అనే గొప్ప కార్యక్రమం చేపట్టారని మంత్రి గుర్తుచేసుకున్నారు.
దాన్ని విశ్వవ్యాప్తంగా చేసిన ఎంపి సంతోష్కుమార్ను మంత్రి ప్రశంత్రెడ్డి ప్రశంసించారు. ఎంపి ఇచ్చిన స్ఫూర్తిని అందరూ స్వీకరించి విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణహితానికి పాటుపడాలని మంత్రి విజ్ఞాప్తి చేశారు. తన జన్మదినం సందర్భంగా ట్వీట్ చేసిన గవర్నర్ సౌందర్ రాజన్, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్కుమార్లకు మంత్రి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలియజేశారు.