కరోనా మహమ్మారి ప్రజలను వణికిస్తున్న నేపథ్యంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా హైదరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటుచేశాయి. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో షూటింగ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణదాస్ నారంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ, కార్యదర్శి జీవిత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కార్యదర్శులు దామోదర్ ప్రసాద్, ప్రసన్నకుమార్తో పాటు నట్టి కుమార్, ఠాగూర్ మధు, రామసత్యనారాయణ, సురేందర్ రెడ్డి, శ్యామ్ప్రసాద్, కొమర వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నారాయణదాస్ నారంగ్ మాట్లాడుతూ “ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో షూటింగ్లను నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నాము. కరోనా వ్యాధి కారణంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి అందరూ సహకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు”అని అన్నారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “షూటింగ్ల నిలిపివేత నిర్ణయం కొందరు నిర్మాతలకు ఇబ్బంది కలిగించినా సరే మా ఈ నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరుతున్నాము. కరోనా కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ఎక్కడా షూటింగ్స్ జరుగవు”అని తెలిపారు.
బెనర్జీ మాట్లాడుతూ “కరోనా చాలా భయంకరమైన వ్యాధి కావున తెలంగాణ ప్రభుత్వం థియేటర్లు, స్కూళ్లు, కాలేజీల బంద్ను ప్రకటించడం జరిగింది. అదే విధంగా షూటింగ్లను నిలిపివేయాలని మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది”అని పేర్కొన్నారు. నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ “తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. ఎవరికీ ఇబ్బంది లేకుండా తీసుకున్న నిర్ణయం ఇది. థియేటర్స్ బంద్తో పాటుగా షూటింగ్లను కూడా నిలిపివేయాలని మేము నిర్ణయించాం”అని అన్నారు.