సిద్దిపేట: సిఎం కెసిఆర్కు సిద్దిపేట అంటే అమితమైన ప్రేమ ఉందని మంత్రి కెటిఆర్ తెలిపారు. సిద్ధిపేట ప్రజలు ధన్యజీవులన్నారు. రంగనాయక సాగర్ ప్రాజెక్ట్ ద్వారా సిద్దిపేట నియోజకవర్గానికి 71 వేల ఎకరాలు, సిరిసిల్ల నియోజకవర్గానికి 23,645 ఎకరాలు, హుస్నాబాద్కు 4900 ఎకరాలు, మానుకోండూరుకు 9700 ఎకరాలు, జనగామ నియోజకవర్గానికి 1000 ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రంగనాయక సాగర్ జలాశయంలోకి గోదావరి జలాలను మంత్రులు హరీష్ రావు, కెటిఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఆరు నియోజక వర్గాలకు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు ఇక్కడి రైతులకు కాలువలు అంటే తెలియదు…. వర్షం పడితే బోర్ల ద్వారా మాత్రమే పంటలు పండించేవారని, కాలంతో పని లేకుండా రబీ, ఖరీఫ్ పంటలు పండించుకోవచ్చని కెటిఆర్ పేర్కొన్నారు. కెసిఆర్ నాయకత్వంలో కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని కూలీలు పూర్తి చేశారని ప్రశంసించారు. గోదావరి జలాలు ఉవ్వెత్తున ఎగిసిపడి మమ్మల్ని కూడా ఆశీర్వదించాయని, చిరస్మరణీయ ఘట్టం తమ చేతుల మీదుగా ప్రారంభ కావడం అదృష్టమని, కాళేశ్వరం నిర్మాణంలో సిఎం కెసిఆర్ ఆలోచనలకు అనుగుణంగా హరీష్ రావు శ్రమించారని, కాళేశ్వరం నిర్మాణంలో శ్రమించిన హరీష్ రావుకు కెటిఆర్ అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో నాలుగు రకాల విప్లవాలు చూడబోతున్నామని, తెలంగాణలో హరిత విప్లవం వస్తుందని, మత్స సంపద పెరిగి నీలి విప్లవం రాబోతుందని, పాడి రైతులు క్షీర విప్లవం తీసుకొస్తారని, గొర్రెల పెంపకం ద్వారా గులాబీ విప్లవం వస్తుందని ఆశభావం వ్యక్తం చేశారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి కెసిఆర్ నాయకత్వంలో అవుతుందని కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.