రూ.10వేలు లంచం తీసుకుంటుండగా
అరెస్టు చేసిన అధికారులు
మాదన్నపేట్ : సైదాబాద్ ఉప విద్యాశాఖ అధికారి కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ పని చేస్తున్న బాబురాజ్ ప్రభుత్వ పాఠశాల భవన యాజమాని నుంచి రూ.10వేలు లంచం తీసుకుంటుండగా ఎసిబి అధికారులు అరెస్టు చేశారు. ఓ రిటైర్డ్ ఉద్యోగి తన భవనాన్ని ప్రభుత్వ పాఠశాలకు అద్దెకు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన బిల్లు విషయంలో విద్యాశాఖకు సంబంధించిన రికార్డ్ అసిస్టెంట్ రూ. 10వేలు లంచం అడగటంతో బాధితుడు ఎసిబి అధికారులకు ఫిర్యాదు చేశారు. శనివారం సైదాబాద్లోని ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం (సైదాబాద్ రేంజ్-1)లో ఎసిబి అధికారులు బాబురాజ్ను పక్కా ప్లాన్తో పట్టుకున్నారు. సైదాబాద్కు చెందిన మీర్ గజాన్ఫర్ అలీ ఖాన్ రిటైర్డ్ ఉద్యోగి. ఇతనికి పాతబస్తీ ఛావనీలో ఓ భవనం ఉంది. ఈ భవనాన్ని ప్రభుత్వ పాఠశాలకు అద్డె కు ఇచ్చాడు. సైదాబాద్ రేంజ్కు సంబంధించిన ఉప విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి స్కూల్ భవన అద్దె కింద ఇటీవల రూ.12లక్షలు విడుదలయ్యాయి.
ఇందులో ఆదాయపన్ను కింద ఉప విద్యాశాఖ అధికారి ఎఒ అకౌంట్లో రూ.1లక్ష26వేలు ఉండిపోయాయి. ఎఒ అకౌంట్లో ఉన్న డబ్బులను ఆదాయపన్ను శాఖకు బదిలీ చేస్తే, భవన యజమాని ఆదాయపన్ను శాఖ నుం చి తిరిగి ఆయన అకౌంట్లో జమ అవుతాయి. కానీ రికార్డ్ అసిస్టెంట్ బాబురాజ్ ఆ పని చేయడం లేదు. పలుమార్లు కోరినా బాబురాజ్ పట్టించుకోలేదు. తనకు రూ.30వేలు ఇస్తే ఆ పని చేస్తానని మీర్ గజాన్ఫర్ అలీ ఖాన్కు బాబురాజ్ తేల్చి చెప్పాడు. అయితే పది వేలు ఇస్తానని మీర్ గజాన్ఫర్ అలీ ఖాన్ బాబురాజ్కు తెలిపాడు. ఈ విషయాన్ని ఫోన్లో రికార్డు చేసి ఎసిబి అధికారులను మీర్ గజాన్ఫర్ అలీ ఖాన్ ఆశ్రయించాడు. ఈ క్రమంలో ఎసిబి అధికారులు శనివారం వలపన్ని రికార్డు అసిస్టెంట్ బాబురాజును రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. బాబురాజ్ను అరెస్టు చేసి ఎసిబి కోర్టులో హాజరుపర్చినట్టు ఎసిబి అధికారులు తెలిపారు.