కంబళ క్రీడాకారుడిపై మహీంద్ర చైర్మన్ ఆనంద్ ట్వీట్.. స్పందించిన కేంద్ర మంత్రి
బెంగళూరుకు రైలు టికెట్లు బుక్ చేసిన శాయ్
న్యూఢిల్లీ : జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్ను మించిన వేగంతో పరిగెత్తిన అందరి దృష్టి ఆకర్షించిన శ్రీనివాసగౌడపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడికి ప్రభుత్వం శిక్షణ ఇచ్చి ఒలింపిక్స్కు పంపిస్తే బాగుంటుందని మహీంద్రా అండ్ మహీంద్రా చైర్మన్ ఆనంద్ మహీంద్రా ట్విటర్ వేదికగా శ్రీనివాస గౌడను ప్రశంసిస్తూ ఈ విషయాన్ని కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు దృష్టికి తీసుకెళ్లారు’ అతడి శరీర ధారుడ్యాన్ని ఒక్కసారి చూడడండి. అథ్లెటిక్స్లో విజయాలు సాధించే సామర్థ్యం అతనిలో కనిపిస్తుంది. అందుకే అతడికి 100 మీటర్ల స్ప్రింట్ విభాగంలో శిక్షణ అందించేలా మంత్రి కిరణ్ రిజిజు చూడాలి లేదా కంబళ క్రీడను ఒలింపిక్స్లో చేర్చేలా ప్రయత్నం చేయాలి. దీంతో పాటు శ్రీనివాస్ గౌడకు బంగారు పతకాన్ని కూడా అందించాలంటూ’ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్ర ట్వీట్కు మంత్రి రిజిజు స్పందించారు. శ్రీనివాస్ గౌడను పిలిపిస్తామని హామీ ఇచ్చారు. అథ్లెటిక్స్కు సంబంధించి ఒలింపిక్స్ ప్రమాణాలపై చాలా మందికి అవగాహన ఉండదని, శారీరక ధృడత్వం, ఓర్పు చాలా అవసరమన్నారు. ట్రయల్స్ కోసం శ్రీనివాస గౌడను శాయ్ కోచ్ల వద్దకు పంపిస్తామని, దేశంలో ప్రతిభ కనబరిచే వ్యక్తులను ఎప్పటికీ వదులుకోబోమని రిజిజు పేర్కొన్నారు. మరోవైపు రిజిజు ప్రకటన చేసిన కొద్ది గంటల్లోనే శాయ్ కూడా వేగంగా స్పందించింది. శ్రీనివాస గౌడ ఎక్కడ ఉన్నాడో కనుక్కొని అక్కడి నుంచి బెంగళూరులోని తమ కార్యాలయానికి వచ్చేందుకు రైలు టికెట్లు బుక్ చేశామని ప్రకటించింది. శ్రీనివాస గౌడను కోచ్లు పరిశీలించిన తర్వాత నిర్ణయాలుంటాయని శాయ్ పేర్కొంది. ఇటీవల మంగళూరు సమీపంలో జరిగిన కంబళ క్రీడలో వంద మీటర్ల దూరాన్ని బురద నీటిలో కేవలం9.55 సెకెన్లలో చేధించాడు. దున్నలు లేకుండా అతడు ఇంకెత దూరం పరిగెత్తగలడన్నదానిపై దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చ ప్రారంభమైంది. ప్రపంచంలోనే పరుగుల యంత్రంగా పేరున్న ఉసేన్ బోల్ట్ను తలదన్నుతాడని ప్రశంసిస్తున్నారు.
Anand Mahindra tweet on Srinivas Gowda